న్యూఢిల్లీ : ఆర్బీఐ రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించిన అనంతరం తమకు 72 శాతం క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) తెలిపింది. రూ. 2000 నోట్లను వదిలించుకునే క్రమంలోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్న శుక్రవారం నుంచి కస్టమర్లు అధికంగా సీఓడీ ఆర్డర్లకు మొగ్గుచూపారు.
ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోట్లను ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా డిపాజిట్ లేదా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ ప్రకటన నేపధ్యంలో ప్రజలు రూ. 2000 నోట్లను వదిలించుకునేందుకు బంగారు ఆభరణాల షాపులకు, పెట్రోల్ బంకులకు బారులుతీరారు. మరోవైపు 2000 నోట్లను మార్చుకునేందుకు డెడ్లైన్కు ఇంకా నాలుగు నెలల సమయం ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్నికాంత్ దాస్ స్పష్టం చేశారు.
చలామణిలో ఉన్న కరెన్సీలో 2000 నోట్లు కేవలం 10.8 శాతమేనని, ఆర్ధిక వ్యవస్ధపై దీని ప్రభావం అత్యంత స్వల్పమని పేర్కొన్నారు. ఆర్బీఐ కరెన్సీ మేనేజ్మెంట్ ఆపరేషన్స్లో భాగంగా రూ. 2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయమని ఆయన అభివర్ణించారు. సెప్టెంబర్ 30లోగా ఉపసంహరించిన 2000 నోట్లలో చాలావరకూ ఖజానాకు తిరిగివస్తాయని శక్తికాంత్ దాస్ అంచనా వేశారు.
Read More