Crypto Currencies | క్రిప్టో కరెన్సీల నియంత్రణకు, క్రిప్టో కరెన్సీ పేరిట జరుగుతున్న నేరాలను దర్యాప్తు చేయడానికి వ్యవస్థ ఏర్పాటు చేసే విషయమై నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. క్రిప్టో కరెన్సీల నియంత్రణ కోసం వ్యవస్థ ఏర్పాటు చేసే విషయమై చర్చలు జరుపుతున్నట్లు జస్టిస్లు సూర్యకాంత్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య బెంచ్కు అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్ జిత్ బెనర్జీ తెలిపారు. అయితే, క్రిప్టో కరెన్సీల నియంత్రణకు వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వ వైఖరి విషయమై తదుపరి విచారణ తేదీ నాటికి అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు.
`వివిధ రాష్ట్రాల్లో క్రిప్టో కరెన్సీల విషయమై పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరిపై అఫిడవిట్ దాఖలు చేయడానికి అదనపు సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు నాలుగు వారాల సమయం ఇస్తున్నాం` అని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. క్రిప్టో కరెన్సీల దుర్వినియోగం, మోసాల నుంచి సామాన్యుడికి రక్షణ కల్పించడానికి కేంద్రం ఎటువంటి రక్షణ చర్యలు చేపడుతున్నదో తెలుపాలని అదనపు సొలిసిటర్ జనరల్ను జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు.
`ఎటువంటి క్రిప్టో కరెన్సీలను నియంత్రించాలన్న విషయమై మనకు నిపుణులు లేవు. వాటిని నియంత్రించడానికి ఎటువంటి వ్యవస్థ లేకపోతే ఎవరైనా ఆ కరెన్సీ సృష్టించి లావాదేవీలు ప్రారంభించవచ్చు. ఇది చాలా ప్రమాదకరం` అని అదనపు సొలిసిటర్ విక్రమ్ జిత్ బెనర్జీని జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తదుపరి విచారణ తేదీ నాటికి అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 21కి వాయిదా వేశారు.