న్యూఢిల్లీ, జూలై 14: ఎఫ్ఎంసీజీ సంస్థ విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్.. దేశీయ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల వ్యాపారంలోకి వస్తున్నట్టు గురువారం ప్రకటించింది. స్నాక్ ఫుడ్, స్పైసెస్, రెడీ-టు-ఈట్ మార్కెట్లో ప్రధాన సంస్థగా ఎదగాలని కోరుకుంటున్నట్టు రిషద్ ప్రేమ్జీ నేతృత్వంలోని విప్రో ఎంటర్ప్రైజెస్లో భాగమైన ఈ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
‘ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారంలోకి రావాలన్న మా నిర్ణయంతో భారతీయ ఎఫ్ఎంసీజీ రంగంలో అన్ని రకాల ఉత్పత్తుల తయారీలో విప్రో ఉన్నట్టవుతున్నది’ అని విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ సీఈవో వినీత్ అగర్వాల్ ఈ సందర్భంగా అన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2021-22) విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ రెవిన్యూ రూ.8,634 కోట్లుగా ఉన్నది.