బెంగళూరు, జూలై 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ ఏప్రిల్-జూన్లో సంస్థ రూ.2,870 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. గతంలో నమోదైన రూ.2,563.6 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఆదాయం ఏడాది ప్రాతిపదికన ఆరు శాతం పెరిగి రూ. 22,831 కోట్లకు చేరుకున్నది. ఐటీ సేవల నుంచి వచ్చే ఆదాయం అంచనావేసిన స్థాయిలోనే నమోదైందని, 2,722-2,805 మిలియన్ డాలర్ల మధ్యలో నమోదుకానున్నదన్న గత అంచనా నిజమైందని విప్రో సీఈవో, ఎండీ థిర్రీ డెలాపోర్ట్ తెలిపారు.
గత త్రైమాసికంలో సంస్థ 1.2 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద ఒప్పందంతో కలుపుకొని మొత్తం 3.7 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నది.
వలసలు 19.4 శాతం నుంచి 17.3 శాతానికి తగ్గినప్పటికీ సంస్థను వదిలిపోతున్న ఉద్యోగుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. గత త్రైమాసికంలో 8,812 మంది వీడారు. దీంతో మొత్తం సంఖ్య 2,49,758కి చేరింది.