బెంగళూరు, జనవరి 21: ఫ్రెషర్స్పై విప్రో వేటు వేసింది. 450కిపైగా ట్రైనీలను తొలగించింది. పనితీరు సామర్థ్యంపై సంస్థాగతంగా జరిగిన పరీక్షల్లో పదేపదే విఫలమవడంతోనే వీరిని తీసేయక తప్పలేదని ఈ దేశీయ ఐటీ సంస్థ తాజాగా తెలిపింది. ‘శిక్షణ ఇచ్చిన తర్వాత కూడా అసెస్మెంట్లలో మళ్లీమళ్లీ పేలవ ప్రదర్శన చూపడంతో 452 మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేశాం’ అని విప్రో తెలియజేసింది. కాగా, వీరి శిక్షణ కోసం రూ.75,000 చొప్పున ఖర్చు చేశామని, అయితే ఆ నష్టాన్ని సంస్థనే భరిస్తున్నదని ఈ కోతల గురించి తెలిసిన వర్గాలు తెలిపాయి.
‘విప్రో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుంది. ఐటీ నిపుణులకేగాక.. కొత్తగా వచ్చే ట్రైనీలకూ ఇవి వర్తిస్తాయి. మా క్లయింట్ల అవసరాలు, సంస్థ వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగుల పనితీరు ఉండాల్సిందే’ అని కంపెనీ స్పష్టం చేసింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీరి పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నది. ఇదిలావుంటే తమ సంస్థలో పనిచేస్తూనే.. ప్రత్యర్థి సంస్థల్లో కూడా పనిచేస్తున్నారంటూ గత ఏడాది దాదాపు 300 మందిని ఉద్యోగాల్లో నుంచి విప్రో తీసేసినది విదితమే.