న్యూఢిల్లీ, మే 18(నమస్తే తెలంగాణ): విమానాల పండుగకు ఈ సారి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి 21 వరకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్ ఇండియా 2024’ సదస్సు జరగనున్నది. ఇందుకు సంబంధించి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..2014లో ఆరు కోట్ల మంది ప్రయాణించగా, 2019 నాటికి 14 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు. సగటున వార్షిక వృద్ధిరేటు 14.5 శాతంగా ఉన్నదని మంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు, వచ్చే ఏడాది జరగనున్న వింగ్ ఇండియా 2024 సదస్సు విమాన రంగంలో కొత్త ఆవిష్కరణలకు వేదిక కాబోతున్నదని చెప్పారు.