న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశీయ చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ తగ్గింపు ఊహించినదేనని శుక్రవారం విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ మార్కెట్లో సరిపడా సరఫరా ఉన్నప్పటికీ విమానయాన ఇంధనం, డీజిల్ ఎగుమతులపై లెవీని పెంచడం ఆశ్చర్యకరమంటున్నారు. గురువారం డీజిల్ ఎగుమతిపై లీటర్కు విండ్ఫాల్ ట్యాక్స్ను రూ.2 పెంచిన కేంద్రం.. జెట్ ఇంధన ఎగుమతులనూ తిరిగి పన్ను పరిధిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో లీటర్ డీజిల్ ఎగుమతిపై ట్యాక్స్ రూ.5 నుంచి 7కు పెరగగా, లీటర్ జెట్ ఇంధనంపై రూ.2కు చేరింది. అయితే దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై మాత్రం లెవీని తగ్గించింది. టన్నుపై విండ్ఫాల్ ట్యాక్స్ను రూ.17,750 నుంచి రూ.13,000లకు దించింది. కాగా, ప్రతీ 15 రోజులకోసారి ఈ పన్నును మోదీ సర్కారు సవరిస్తున్న సంగతి విదితమే.