RBI on El Nino | ద్రవ్యోల్బణ నియంత్రణకు తాము చేపట్టిన చర్యలకు ‘ఎల్నినో’ సవాల్ కానున్నదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తేల్చి చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత నాలుగు శాతానికి తీసుకు వచ్చేందుకు తాము చేయాల్సిందంతా చేస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వ్రుద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
గతేడాది ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.8 శాతంతో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. దీంతో దాన్ని కట్టడి చేయడానికి 2022 మే నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ.. 250 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచిందని శక్తికాంత దాస్ తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వస్తువుల సరఫరా విషయమై చర్యలు చేపట్టడంతో 2022 ఏప్రిల్లో 7.8 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. గత నెలలో 4.25 శాతానికి దిగి వచ్చిందన్నారు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) మార్కెట్లోకి బియ్యం, గోధుమలు విడుదల చేయడం కూడా ఆహార ద్రవ్యోల్బణం దిగి రావడానికి కారణం అని శక్తికాంత దాస్ చెప్పారు. ఇక ముందు కూడా ద్రవ్యోల్బణం గణాంకాలను ఆర్బీఐ నిశితంగా గమనిస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. తిరిగి దాన్ని నాలుగు శాతానికి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లతోపాటు దేశీయంగా నైరుతి రుతుపవనాలను బట్టి ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం పడుతున్నారు.