Tata Motors | భారత్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఆధిపత్యం ప్రదరిస్తున్న దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. బుల్లి కారు టియాగో మొదలు ఎస్యూవీ నెక్సాన్.ఈవీ వరకూ విక్రయిస్తోంది. హ్యుండాయ్ మోటార్ ఇండియా, ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈవీ కార్లు విక్రయిస్తున్నాయి. కానీ, దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ వాటా 70 శాతం. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. మెర్సిడెస్-బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు విక్రయిస్తున్నాయి. ఇక ఫోక్స్ వ్యాగన్, స్కోడా, రెనాల్ట్, నిసాన్ వంటి సంస్థలు భారత్ మార్కెట్లో ఈవీ కార్లను ఆవిష్కరించడానికి సిద్ధం అయ్యాయి.
ఈ తరుణంలో టాటా మోటార్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కస్టమర్ల నుంచి డిమాండ్ కొనసాగినంత కాలం డీజిల్ కార్ల ఉత్పత్తి కొనసాగుతుందని టాటా మోటార్స్ తేల్చి చెప్పింది. ఒకవైపు కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి డీజిల్ కార్లపై అదనపు జీఎస్టీ విధిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన నేపథ్యంలో టాటా మోటార్స్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. కార్ల తయారీ దారులు స్వచ్ఛందంగా డీజిల్ కార్ల తయారీకి స్వస్తి పలుకాలని ఇటీవల సియామ్ సదస్సులో గడ్కరీ సూచించిన సంగతి తెలిసిందే.
కర్బన ఉద్గారాల నియంత్రణకు రెగ్యులేటరీ నిబంధనలు పాటిస్తూనే డీజిల్ కార్లు ఉత్పత్తి చేస్తామంటోంది టాటా మోటార్స్.. మరోవైపు ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిశగా మరింత వేగంగా దూసుకెళ్తామని చెబుతోంది. ఈవీ కార్లను తయారు చేయాలని కేంద్రం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు.