Auto Expo 2023 | ఆటో ఎక్స్పోగా ఇండియన్ మోటార్ షో పాపులర్. దాదాపు మూడేండ్ల తర్వాత మళ్లీ వీక్షకులకు.. ప్రత్యేకించి కార్లు, టూ వీలర్స్ తయారీ సంస్థలు కొత్త మోడల్స్ ఆవిష్కరణకు ఇది వేదిక.. ఈ దఫా పలు ఆటోమొబైల్ సంస్థలు.. కొత్త వెహికల్స్.. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రజల ముంగిట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కానీ ప్రముఖ బ్రాండ్లు.. మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోక్స్ వ్యాగన్, స్కోడా, హోండా కార్స్, నిస్సాన్, రెనాల్ట్ వంటి సంస్థలు ఈ ఆటో షోకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి తెలుస్తోంది. ప్రముఖ టూ వీలర్స్ సంస్థలు హీరో హోండా, బజాజ్ ఆటో వంటివి ఎంట్రీకి సిద్ధంగా లేవని సమాచారం.
ప్రతి రెండేండ్ల కోసారి జనవరి లేదా ఫిబ్రవరిలో ఆటోమొబైల్ ప్రేమికులకు కనువిందు చేసేదే ఇండియన్ మోటార్ షో.. లేదు లేదు ఆటో ఎక్స్పో. ఇంతకుముందు 2020లో జరుగాల్సిన ఎక్స్పో 2022కి వాయిదా పడింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఆర్గనైజర్లు దీన్ని 2023కి వాయిదా వేశారు.
ఇండియన్ మోటార్ షో 15వ ఎడిషన్.. ఆటో ఎక్స్పో కాంపొనెంట్ షో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో ఆటో ఎక్స్పో జరుగనున్నది. ఆటోమోటివ్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరర్స్ ఈ నెల 12-15 మధ్య తమ ఉత్పత్తుల ప్రదర్శనకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఆరు రోజుల పాటు సాగే ఈ వేడుకలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారూఖ్ఖాన్, రణ్వీర్ సింగ్, వరుణ్ ధావన్ వంటి ప్రముఖ బ్రాండ్ అంబసిడార్ల ఆధ్వర్యంలో కొత్త మోడల్ కార్లు, మోటార్ బైక్స్, స్కూటర్స్ ఆవిష్కరిస్తారు. ఈ దఫా ఎక్స్పోలో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్, కియా మోటార్స్, టాటా మోటార్స్, బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్), ఎంజీ మోటార్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్, వోల్వో ఇండియా కొత్త మోడల్స్ ఆవిష్కరణకు రెడీ అయ్యాయి.
టొర్క్ మోటార్స్, ఒకినావా ఆటోటెక్, హీరో ఎలక్ట్రిక్, లాగ్9 మెటీరియల్, ఈఎల్ మోటో, మ్యాటర్ మోటార్ వర్క్స్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్, సిబ్రోస్ టెక్నాలజీస్ ఇండియా, ఓంజే ఏఏవే, ఆటోలైన్ ఈ-మొబిలిటీ, హోప్ ఎలక్ట్రిక్, డివోట్ మోటార్స్, ఎంటీఏ ఈ-మొబిలిటీ, గ్రేవ్స్ కాటన్, ఒమెగా సైకీ మొబిటిటీ సంస్థలు హావా ప్రదర్శించనున్నాయి.
మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ, వోల్వో నుంచి పొర్చే, లంబోర్ఘినీ, జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ వంటి బ్రాండ్లు ఈ ఎక్స్పోకు దూరం కానున్నాయి. లెక్సాస్ మాత్రమే ఈ షోలో పాల్గొంటున్నట్లు ధృవీకరించింది. ఇక ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) టూ వీలర్ సెగ్మెంట్లోనూ హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ), బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీ, రాయల్ ఎన్ఫీల్డ్ గైర్హాజరు కానున్నాయి.
ఆటో ఎక్స్పోకు దూరంగా ఉంటామని పేర్కొంటున్న అత్యధిక కంపెనీలు అందుకు కారణాలు చెప్పడానికి నిరాకరిస్తున్నాయి. ఈ ఈవెంట్కు సదరు సంస్థలు దూరంగా ఉండటానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తున్నది. కొన్ని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల యాజమాన్యాలు.. ఎక్స్పో టైమ్, ఎక్స్పో ఏర్పాటు చేసిన వేదిక కారణాలుగా చెబుతున్నాయి. ఈ ఈవెంట్లో ఇన్వెస్ట్మెంట్ నుంచి తక్కువ రిటర్న్స్ వస్తాయని పెదవి విరుస్తున్నాయి.
ఆటో ఎక్స్పోకు కొన్ని కంపెనీలు దూరం కావడం కొత్తేం కాదని ఇండస్ట్రీ బాడీ సియాం డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ పేర్కొన్నారు. 2020లో దూరంగా ఉన్న టయోటా కిర్లోస్కర్ ఈ దఫా పాల్గొంటున్నది. 2022లో జరుగాల్సిన ఎక్స్పో 2023కి వాయిదా పడటం మరో కారణం. ఇక ఐసీఈ- టూ వీలర్స్ తయారీ సంస్థలు 2018 నుంచి ఎక్స్పోకు దూరంగా ఉంటున్నాయని చెప్పారు. సీఐఐ ఫ్యూచర్ మొబిలిటీ నేషనల్ కమిటీ చైర్మన్ విపిన్ సోంధీ మాట్లాడుతూ ఈ దఫా ఎక్స్పోలో ఆటో ప్రేమికులకు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు.