మార్చిలో 7.39 శాతంగా నమోదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) రికార్డు స్థాయిలో పెరిగింది. గత నెలలో ఏకంగా 7.39 శాతానికి ఎగబాకి ఎనిమిదేండ్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ 4.17 శాతంగా ఉన్నది. దీనితో పోలిస్తే మార్చిలో 3.22 శాతం ఎక్కువగా నమోదైంది. దీంతో వరుసగా నాలుగో నెలలోనూ టోకు ద్రవ్యోల్బణం పెరిగినట్లయింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, లోహాల ధరలు వృద్ధి చెందడమే డబ్ల్యూపీఐ ఈ స్థాయిలో పెరిగేందుకు కారణమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. ఇంతకుముందు 2012 అక్టోబర్లో టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 7.4 శాతంగా నమోదైంది. వరి, పప్పు ధాన్యాలు, పండ్ల ధరలు భారీగా పెరగడంతో ఈ ఏడాది మార్చిలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 3.24 శాతానికి ఎగసింది. గత నెలలో పప్పు ధాన్యాల టోకు ద్రవ్యోల్బణం 13.14 శాతంగా, పండ్ల ధరల సూచీ 16.33 శాతంగా, వరి ద్రవ్యోల్బణం 1.38 శాతంగా నమోదైంది.