పరిగి, జూలై 4 : అన్ని గ్రామాల అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగి మండలంలోని చిట్యాల్ గ్రామంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, తొండపల్లిలో వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామాభివృద్ధికి సర్కారు ప్రతినెల నేరుగా ఆయా గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం మారుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, పచ్చదనంపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా సూచించారు. వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. పల్లె ప్రకృతివనాల్లో మరింత అందాన్నిచ్చే మొక్కలు నాటాలని, ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్గా తీర్చిదిద్దాలని చెప్పారు. చిట్యాల్ గ్రామానికి వెళ్లే రహదారిని రీబీటీతోపాటు ఇతర రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఎ.సురేందర్కుమార్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు హఫీజ్, ఎంపీడీవో దయానంద్, సర్పంచ్లు రజిత, గీత, జగన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, డైరెక్టర్లు హన్మంత్రెడ్డి, చరణ్ పాల్గొన్నారు.
పాడుబడిన ఇండ్లను తొలగించాలి
పాడుబడిన ఇండ్లను తొలగించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఆయా వార్డుల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను తొలిగించాల్సిందిగా సూచించారు. పట్టణంలోని ప్రధాన రోడ్లుకు ఇరువైపులా మొక్కలను నాటి సంరక్షించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిలో భాగంగా చేపడుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు. పరిగి మండలం నస్కల్లో సర్పంచ్ మేడిద పద్మమ్మ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్తోపాటు గ్రామస్తులు శ్రమదానం చేశారు. మిట్టకోడూర్ గ్రామంలో ఇంటింటికీ సర్పంచ్ జయలక్ష్మి మొక్కలను అందజేశారు.