న్యూఢిల్లీ : అడ్డంకులను అధిగమిస్తే భారత్లో వార్షిక బంగారం ఉత్పత్తి గణనీయంగా పెంచవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) స్పష్టం చేసింది. అధికార యంత్రాంగం నుంచి అవరోధాలను తొలగించి, ఈ రంగంలో పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే భారత్లో వార్షిక బంగారం ఉత్పత్తి ప్రస్తుతమున్న 1.6 టన్నుల నుంచి ఏకంగా 20 టన్నులకు ఎగబాకుతుందని డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినిమయ దేశమైన భారత్ తన దేశీ అవసరాల కోసం బంగారం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.
దేశీయంగా బంగారం తయారీని ప్రోత్సహిస్తే దిగుమతులనూ ప్రభుత్వం నియంత్రించే వెసులుబాటు కలుగుతుంది. 2021లో భారత్ అత్యధికంగా 1050 టన్నుల బంగారం దిగుమతులు చేసుకోగా 2020తో పోలిస్తే ఇది 430 టన్నులు అధికం. భారత్ మైనింగ్ సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని, ఇది జరగాలంటే అవరోధాలను తొలగించడంతో పాటు గోల్డ్ మైనింగ్లో పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని డబ్ల్యూజీసీ భారత్ కార్యకలాపాల ప్రాంతీయ అధికారి పీఆర్ సోమసుందరం పేర్కొన్నారు. భారత్లో మైనింగ్ లైసెన్స్ను సంపాదించాలంటే పలు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వంటి సంక్లిష్ట ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉంటోందని కౌన్సిల్ పేర్కొంది.
పలు గోల్డ్ మైనింగ్ ప్రాంతాలు రోడ్డు, రైలు అనుసంధానం లేని నిర్జన ప్రదేశాల్లో ఉన్నాయని అక్కడికి మెటీరియల్స్ను తరలించడం సైట్ నుంచి ఉత్పత్తులను బయటకు తీసుకురావడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భారత్లో కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ నుంచి బంగారం ఉత్పత్తి అధికంగా సాగుతోంది. ఈ మైన్లో 4000 మందికి పైగా కార్మికులు, కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు.గోల్డ్ మైనింగ్ రంగం మరో 3000 నుంచి 4000 మంది వరకూ ఉపాధి కల్పిస్తుందని అయితే ఈ రంగానికి పెట్టుబడుల ఊతం అవసరమని డబ్ల్యూజీసీ నివేదిక స్పష్టం చేసింది. గనుల నిర్మాణానికి ఇతర వ్యయాలకు ఈ రంగంలోకి రూ 7000 కోట్ల పెట్టుబడులు తరలిరావాలని డబ్ల్యూజీసీ అంచనా వేసింది.