న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఆకాశ ఎయిర్కు పెట్టుబడుల కొరత లేదని, ఆర్థికంగా సంస్థ బలంగానే ఉన్నదని ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈవో వినయ్ దూబే తెలిపారు. ఎయిర్లైన్ ప్రధాన మదుపరి రాకేశ్ ఝున్ఝున్వాలా చనిపోయిన నేపథ్యంలో బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కంపెనీ వృద్ధికి ఏమాత్రం ఢోకా లేదని దూబే స్పష్టం చేశారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో మరిన్ని విమానాల కోసం కూడా ఆర్డర్ చేయనున్నట్టు చెప్పారు. ఈ నెల 7న విమానయాన సేవల్ని ఆకాశ ఎయిర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం సంస్థ చేతికి మూడో విమానం అందగా, త్వరలోనే ముంబై-బెంగళూరు మధ్య వినియోగిస్తామని ఆయన వెల్లడించారు. ఇకపై ప్రతీ రెండు వారాలకు ఓ విమానాన్ని అందుబాటులోకి తెస్తామన్న ఆయన వచ్చే ఐదేండ్లలో 72 విమానాలను అందుకుంటామన్నారు. కాగా, ఆకాశ ఎయిర్కు అన్నివిధాలా అండగా నిలిచిన ఝున్ఝున్వాలాకు దూబే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.