హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ఎండీ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శి పంకజ్ కుమార్ బన్సల్ గురువారం సైఫాబాద్లోని శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్(ఎస్ఎన్సీసీఎఫ్ఎల్) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని స్వయం సహాయ బృందాలకు తాము అందిస్తున్న ఆర్థికపరమైన సేవలను గురించి ఆయనకు వివరించినట్లు శ్రీనిధి సహకార సమాఖ్య ఎండీ జీ విద్యాసాగర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
తాము అందిస్తున్న సేవలపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఇటువంటి విధానాలను దేశమంతా అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నట్లు చెప్పారు. అంతేకాకుండా శ్రీనిధికి అవసరమైన ఆర్థిక పరమైన సహకారం అందించేందుకు, సహకార రంగం కింద శ్రీనిధిని బ్యాంకుగా మార్చేందుకు తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీనిధి ఎండీ వివరించారు.