ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, జూలై 25: అధిక క్రూడ్ ధరలు, బంగారం దిగుమతుల పెరుగుదలతో విస్త్రతమవుతున్న కరెంట్ ఖాతా లోటును ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బంగారం దిగుమతుల్ని అదుపు చేయడానికి ఇటీవలే ఆ దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచినట్టు సోమవారం ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక మంత్రి గుర్తుచేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యాడ్ 3.25 శాతానికి పెరుగుతందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 1.2 శాతమే. కరెంట్ అకౌంట్ డిఫిసిట్ (క్యాడ్, దేశంలోకి వచ్చి, పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం)ను పూడ్చేదిశగా విదేశీ మారక నిధుల్ని ఆకర్షించేందుకు రిజర్వ్బ్యాంక్ ఇటీవల పలు చర్యల్ని ప్రకటించిందని మంత్రి వెల్లడించారు. ఎగుమతులు, దిగుమతుల ఇన్వాయిసింగ్, పేమెంట్, సెటిల్మెంట్ను డాలర్లకు బదులుగా రూపాయిల్లో జరుపుకునే పద్దతిని ఈ నెలలోనే రిజర్వ్బ్యాంక్ ప్రవేశపెట్టింది.
క్యాడ్ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నదా? అలాగైతే క్యాడ్ను తగ్గించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఏమిటా చర్యలు అంటూ సంధించిన ప్రశ్నలకు సీతారామన్ స్పందిస్తూ.. ఎగుమతులు, దిగుమతులు, క్రూడ్ ధర తదితర పలు అంశాలపై క్యాడ్ పరిమాణం అధారపడి ఉంటుందని, వీటన్నింటినీ ప్రభుత్వం జాగురూకతతో గమనిస్తున్నదన్నారు.