Vodafone Idea: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా దాదాపు 20 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) గణాంకాలను రిలీజ్ చేసింది.
ఫిబ్రవరి నెలలో వొడాఫోన్ ఐడియా(VI) 20 లక్షల మంది వినియోగదారులను చేజార్చుకున్నట్లు ట్రాయ్ తన రిపోర్టులో తెలిపింది. అదే నెలలో జియోలోకి 10 లక్షల మంది చేరగా, ఎయిర్టెల్లోకి 9,82,554 మంది చేరారు. అదేవిధంగా మొత్తం వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 10లక్షల మేరకు తగ్గారని ట్రాయ్ తెలిపింది. ఇక సబ్స్క్రైబర్ల పరంగా జియో 37.41శాతం వాటా కలిగి ఉండగా ఎయిర్ 32.39శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది. 10లక్షల మంది కస్టమర్లను కోల్పోయినప్పటికీ వొడాఫోన్ ఐడియాకు మార్కెట్లో 20శాతం ఉంది. దేశం మొత్తం మీద ప్రైవేట్ టెలికాం కంపెనీల వాటా 90శాతం కాగా, BSNL, MTNLలకు 9.37 శాతం వాటా ఉంది.
వినియోగదారులు తగ్గడానికి కారణాలేంటి..?
ముఖ్యంగా వొడాఫోన్ ఐడియాకు అప్పులు ప్రధాన సమస్యగా మారాయి. సెప్టెంబర్ నాటికి ఆ కంపెనీకి రూ.2.2లక్షల కోట్ల వరకు అప్పులు ఉండగా, ఏజీఆర్ బకాయిల కింద దాదాపు రూ.16వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఈక్విటీ కింద మార్చుకుంది. జియో, ఎయిర్టెల్ పోటాపోటీగా 5G సేవలు తీసుకొస్తుండగా VI మాత్రం ఇప్పటివరకు ఇంకా 5G నెట్వర్క్ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవడం లేదు. చందాదారులు ఇతర నెట్వర్క్లకు వెళ్లడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా మళ్లీ వొడాఫోన్ ఐడియా బోర్డులోకి రావడం మంచి పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు.