న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి. మంగళవారం ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయల్దేరాల్సిన విమానాలను రద్దుచేశారు. ఇందులో ముంబై నుంచి టేక్ఆఫ్ కావాల్సిన 15 విమానాలు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన 11 విమానాలు ఉన్నాయి. కాగా, సోమవారం 50 విమానాలను రద్దవగా, మరో 160 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.
విమానాల రద్దు, ఆలస్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విస్తారా విమానాల కోసం ఎయిర్పోర్టుల్లో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నదని, సరైన సమాచారం ఉండటం లేదని పలువురు ప్రయాణికులు విమర్శించారు. దీనిపై విస్తారా సంస్థ స్పందిస్తూ.. తమ వినియోగదారులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు చెప్పింది. గతకొన్ని రోజులుగా తాము పైలట్ల (Pilots) కొరతతోపాటు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని వెల్లడించింది. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నామని పేర్కొంది.