Petrol Prices | న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ఇతరత్రా ఇంధనాల ధరలు పెరగనున్నాయా?.. అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయిప్పుడు. దేశ ఇంధన అవసరాలు దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్పై భారీగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్ని ఎగదోస్తాయని కూడా వారు అంటున్నారు. ఇదే జరిగితే దేశీయంగా ఇంధన ధరలు పరుగులు పెట్టడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
ఈ నెల 1న సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కూడా దీన్ని ధ్రువీకరించింది. నిర్దిష్ట లక్ష్యాలను గురిపెడుతూ ఈ దాడి జరిగిందని పేర్కొన్నది. దీంతో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా 300లకుపైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. దీనికి ఇజ్రాయెల్ స్పందించే తీరునుబట్టి గ్లోబల్ మార్కెట్లు నడుస్తాయని అంటున్నారు. ఇరాన్ దాడుల మధ్య నిరుడు అక్టోబర్ నుంచి ఎప్పుడూ లేనంతగా ముడి చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇరాన్పై ప్రతీకార దాడుల్లో తాము పాల్గొనబోమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టం చేశారు. ఇది కూడా మార్కెట్ను ప్రభావితం చేయగలదన్న అభిప్రాయాలు ఇప్పుడు ఉన్నాయి.
హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే రవాణాకు అంతరాయం ఏర్పడితే గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలకు పట్టపగ్గాలుండబోవని విశ్లేషకులు అంటున్నారు. ఒమన్, ఇరాన్ మధ్య ఈ జలసంధి ఉన్నది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతున్నది. ఇప్పటికే ఇజ్రాయెల్తో సంబంధాలున్న ఓ వాణిజ్య నౌకను ఈ జలసంధిలో ఇరాన్ అడ్డుకున్నది. ఇది ఇంతటితో ఆగకపోతే కష్టమే. భారత్కూ ముడి చమురు సరఫరా తగ్గిపోతుంది. ఒపెక్ కూటమి సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, కువైట్ ,ఇరాక్ల నుంచి ఈ జలసంధి ద్వారానే పెద్ద ఎత్తున చమురు రవాణా జరుగుతుంది. భారత్ క్రూడాయిల్ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో సౌదీ కీలకమన్న సంగతి విదితమే.
మిడిల్ ఈస్ట్ దేశాల్లో చీమ చిటుక్కుమన్నా.. భారత్లో అలజడి మొదలవుతుంది. దీనికి కారణం చమురు ఎగుమతి దేశాల్లో మిడిల్ ఈస్ట్ దేశాలే ముందుండటం, అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ తొలి వరుసలో ఉండటమే. కాబట్టి ఆయా దేశాల్లో ఉద్రిక్తతలు ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగిస్తే.. భారత్లో డిమాండ్కు తగ్గ సైప్లె ఉండబోదు. దీంతో సహజంగానే ధరలు రెక్కల్ని తొడుగుతాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగినా, ఇంకా పెరిగినా బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లను తాకుతుందన్న అంచనాలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే సోమవారం ఉదయం జరిగిన ట్రేడింగ్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దీనికి కారణం మార్కెట్ భాగస్వాములు రిస్క్ ప్రీమియంలను తగ్గించడమే. ఇరాన్ దాడులతో తమకు పెద్ద నష్టమేమీ జరుగలేదని ఇజ్రాయెల్ చేసిన ప్రకటనతో రిస్క్ ప్రీమియంలు తగ్గాయి.
లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యానే కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి చమురు ధరల పెంపును ఆపుతున్నదనే అభిప్రాయాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తప్పక ఉంటుందనే వ్యూహాత్మకంగా ఇంధన ధరల్ని స్థిరంగా ఉంచుతున్నారని అంటున్నారు.
ఈ క్రమంలో ఎన్నికలు ముగిస్తే చమురు మార్కెటింగ్ సంస్థలు రేట్లను పెంచడం మొదలు పెట్టేస్తాయని, అప్పుడిక ఎప్పటికి ఈ వడ్డింపులు ఆగుతాయో కూడా చెప్పడం కష్టమేనని వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. లీటర్ పెట్రోల్ రూ.120-125ను తాకినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తుందని, దాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతుందని, ఫలితంగా కీలక రంగాల్లో స్తబ్ధత, జీడీపీలో మందగమనం ఒకదాని వెంట ఒకటి జరిగిపోతుందని వివరిస్తున్నారు. మొత్తానికి ఏం జరిగినా లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా రేట్లు అలాగే ఉండి, ఆ తర్వాత అధికారంలోకి ఎవరు వచ్చినా ధరలు పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.