అమ్మకాలు లేవు.. లాభాలూ లేవు.. ఇదీ దేశీయ మార్కెట్లో నెలకొన్న దుస్థితి. సామాన్యుడి వినిమయ, కొనుగోలు సామర్థ్యాలు దెబ్బతినడంతో అన్ని కీలక రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికిగాను కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు ఇందుకు అద్దం పడుతున్నాయి మరి.
న్యూఢిల్లీ, మే 8: ఎక్కడైనా.. ఎప్పుడైనా వినిమయ, కొనుగోలు సామర్థ్యాలు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థకుగానీ.. మార్కెటింగ్ వ్యవస్థకుగానీ బలం. ఇక పేద, మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాల గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుడి ఆర్థిక పరిస్థితులపైనే దేశ ఆర్థిక తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయన్నా ఆశ్చర్యం లేదు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికిగాను కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలను చూస్తే.. భారత్లో సగటు మనిషి వినిమయ, కొనుగోలు సామర్థ్యాలు పడిపోయాయని స్పష్టంగా తెలుస్తున్నది. అమ్మకాల్లేక 11 త్రైమాసికాల్లోనే అత్యంత కనిష్ఠ స్థాయికి కంపెనీల లాభాలు దిగజారిపోయాయని ఓ రిపోర్టు చెప్తున్నది మరి.
2020 ఏప్రిల్ నుంచి..
గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 390 సంస్థల నికర లాభాలు కలిపి కేవలం 2.3 శాతం వృద్ధినే చూడగలిగాయి. 2020-21 తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) నుంచి గమనిస్తే ఇదే అతి తక్కువ. నిజానికి నిరుడు జనవరి-మార్చిలో ఇది 47.6 శాతంగా ఉండటం గమనార్హం. కానీ గత ఏడాది అక్టోబర్-డిసెంబర్కు 3.4 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరి-మార్చికి మరింత క్షీణించింది. ఇక బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమాయేతర సంస్థల సంగతికొస్తే లాభాలు గతంతో పోల్చితే పతనమయ్యాయి. మైనస్ 3.8 శాతంగా నమోదవడం గమనార్హం.
అమ్మకాల్లేక.. వడ్డీల భారంతోనే..
ఓవైపు అమ్మకాలు లేక.. మరోవైపు వ్యాపారం కోసం తెచ్చిన అప్పులకు వడ్డీల భారంతో కంపెనీల లాభాలు ఆవిరైపోతున్నాయి. ఈ జనవరి-మార్చిలో అన్ని కంపెనీల అమ్మకాల్లో వృద్ధి 13.8 శాతంగానే ఉండగా.. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమాయేతర సంస్థల సంగతికొస్తే 8.5 శాతానికే పరిమితమైంది. నిరుడు జనవరి-మార్చిలో అన్నికంపెనీల అమ్మకాల్లో వృద్ధి 22.4 శాతం ఉన్నది. కానీ అక్టోబర్-డిసెంబర్ నాటికి ఇది 18.7 శాతానికి పడిపోయింది. జనవరి-మార్చికల్లా ఇంకా తగ్గుముఖం పట్టింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల సంస్థలను కలిపితేగానీ రెండెంకల వృద్ధి సేల్స్లో కనిపించట్లేదంటే మిగతా రంగాల దయనీయ పరిస్థితి అర్థమవుతున్నది. ఇక రుణాలపై వడ్డీ భారం ఈ జనవరి-మార్చిలో 37.7 శాతానికి చేరింది. గడిచిన 17 త్రైమాసికాల్లో ఇదే అత్యంత ఎక్కువ. ఇక లోహాలు, గనుల ఆధారిత సంస్థల్లో కార్యకలాపాలు నిరాశాజనకంగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
మార్కెట్ను ఉత్తేజపర్చాలి
నిస్తేజం ఆవరించిన మార్కెట్ను ఉత్సాహపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే చోదక శక్తులన్నింటికీ ముప్పేనని వారు హెచ్చరిస్తున్నారు. వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగేలా చర్యలు చేపట్టాలని, దిగాలు పడిన రంగాలకు ఆర్థిక చేయూతనూ అందించాలని కోరుతున్నారు. మొత్తానికి మత, కుల, రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టడంపై ఉన్న శ్రద్ధలో కొంతైనా బలహీనపడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్రంలోని మోదీ సర్కారు పెడితే బాగుంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయిప్పుడు.