UPI Voice Command | డిజిటల్ పేమెంట్స్లో కీలకంగా మారిన యూపీఐ పేమెంట్స్ మరింత తేలిక కానున్నాయి. అందుకోసం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పలు చర్యలు తీసుకుంటున్నది. ఇంతకుముందే వాయిస్ కమాండ్ ఆధారిత పేమెంట్స్ ప్రారంభిస్తామని ఆర్బీఐ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ‘వాయిస్ ఆధారిత యూపీఐ పేమెంట్స్’ విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయమై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. ‘హలో! యూపీఐ’ ఫీచర్ వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా మొబైల్ యాప్స్ల్లో అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
డిజిటల్ పేమెంట్ ప్లాట్పామ్స్ను ప్రజలకు మరింత చేరువ చేయడానికే ‘హలో! యూపీఐ’ ఫీచర్ తెస్తున్నట్లు ఈ మేరకు బ్యాంకులకు పంపిన మార్గదర్శకాల్లో తెలిపింది. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ ఎంక్వయిరీ మొదలు కొత్త యూజర్ల చేరిక, లావాదేవీలు, ఫిర్యాదుల పరిష్కారం వరకూ ప్రతిదీ సంభాషణ ద్వారా జరిగేలా యాప్ల్లో మార్పులు తేవాలని పేర్కొంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న యాప్స్లో మార్పులు తేవాలని సూచించింది.
గత సెప్టెంబర్’ జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్-2023’లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ‘హలో ! యూపీఐ’తోపాటు యూపీఐ, యూపీఐ లైట్ ఎక్స్, ట్యాప్ అండ్ పే, బిల్ పే కనెక్ట్ వంటి ఫీచర్లు తెస్తున్నట్లు ప్రకటించారు. ‘హలో!యూపీఐ` ఫీచర్ సాయంతో తమ యూజర్లు వాయిస్ కమాండ్తో లావాదేవీలు పూర్తి చేసే ప్రక్రియ త్వరలో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కాన్, కీప్యాడ్ ద్వారా ఎంటర్ చేసి లావాదేవీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.