UPI Payments | దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్స్లో సరికొత్త రికార్డు నమోదైంది. గత నెలలో 900 కోట్లకు పైగా.. 941 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఈ లావాదేవీల విలువ రూ.14.3 లక్షల కోట్లు అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. గతేడాది మే నెలతో పోలిస్తే మొత్తం డిజిటల్ చెల్లింపుల విలువ 37 శాతానికి పైగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన పోలిస్తే గతేడాది 595 కోట్ల లావాదేవీలు జరిగితే ఈ ఏడాది 58 శాతం పెరిగాయి.
ఏప్రిల్ నెలలో పర్సన్ టూ పర్సన్ పేమెంట్స్ 386 కోట్లు నమోదైతే, పర్సన్ టూ మర్చంట్ లావాదేవీలు 530 కోట్లు రికార్డయ్యాయి. ఏప్రిల్ నెలతో పోల్చినా గత నెల పేమెంట్స్ పెరిగాయి. మే నెలలో మొత్తం మర్చంట్స్ పేమెంట్స్ రూ. 10.85 లక్షల కోట్లు. 2022-23లో 8300 కోట్ల లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ.139 లక్షల కోట్లు. వాలెట్ యాప్స్ ద్వారా 50 శాతానికి పైగా పేమెంట్స్ జరిగితే.. రిటైల్ చెల్లింపులు 85 శాతం పై చిలుకే.
సెలవుల కారణంగా పలువురు పర్యాటక ప్రదేశాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఫాస్టాగ్ పేమెంట్స్ లోనూ గ్రోత్ నమోదైంది. ఏప్రిల్ నెలలో 30.5 కోట్ల లావాదేవీలు జరిగితే.. గత నెలలో 33.50 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. విలువలో 24 శాతం అంటే రూ.5437 కోట్లు, పరిమాణంలో 17 శాతం గ్రోత్ నమోదైంది.