కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ కొలువుదీరిన దగ్గర్నుంచి బ్యాంకులు లక్షల కోట్ల రూపాయల బాకీలను ఖాతా పుస్తకాల నుంచి తొలగించేశాయి. గడిచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని బ్యాంకులు రూ.9.75 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్టు తాజాగా పార్లమెంట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇక బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఉద్దేశపూర్వకంగాఎగవేసినవారు కోకొల్లలు. టాప్-10 ఎగవేతదారులే బ్యాంకుల్ని రూ.40 వేల కోట్లకుపైగా ముంచేసినట్టు అధికారికంగా తేలింది.
న్యూఢిల్లీ, మార్చి 16 : బ్యాంకుల్లో రెడ్ కార్పెట్ పర్చిమరీ ఇచ్చిన బడా రుణాలన్నీ మొండి బకాయిలుగానే మారిపోతున్నాయి. చివరకు ఆ అప్పుల కుప్పల్ని రైటాఫ్ల పేరిట తొలగించి ఖాతా పుస్తకాలను క్లీన్ చేసుకుంటున్నారు బ్యాంకర్లు. గడిచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.9.75 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్టు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి పార్లమెంట్కు తెలియజేశారు. 2019-20లోనైతే అత్యధికంగా రూ.1.59 లక్షల కోట్ల రుణాలను బ్యాంకర్లు సాంకేతికంగా తమ ఖాతా పుస్తకాల నుంచి తీసేశాయని చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2018-19)లోనూ లక్ష కోట్ల రూపాయలకుపైగా రుణాలు రైటాఫ్ అయినట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కూడా రూ.47,568 కోట్ల లోన్లను బ్యాంకులు రైటాఫ్ చేసినట్టు వెల్లడించారు. 2014-15లో రూ.31,723 కోట్లు, 2015-16లో రూ.40,416 కోట్లు, 2016-17లో రూ.68,308 కోట్లు, 2017-18లో రూ.99,132 కోట్ల లోన్లు రైటాఫ్ అయ్యాయని లిఖితపూర్వక సమాధానంగా లోక్సభకు వెల్లడించారు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన ఐదున్నరేండ్లలో రూ.6.15 లక్షల కోట్లకుపైగా రుణాలను రైటాఫ్ చేశాయని గతంలోనే పార్లమెంట్కు మంత్రి పంకజ్ చౌధరి తెలియజేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం 2020-21 నుంచి ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రథమార్ధం (సెప్టెంబర్ 30) వరకు సర్కారీ బ్యాంకులు రూ.6,15,647 కోట్లను రైటాఫ్ చేశాయని మంత్రి లిఖితపూర్వక సమాధానంగా లోక్సభలో నిరుడు డిసెంబర్ 8న చెప్పారు. ఇక రుణాల రైటాఫ్లో దేశంలోని మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)నే టాప్లో ఉన్నది. 2020-21 నుంచి 2024-25 వరకు రూ.1.10 లక్షల కోట్లకుపైగానే రుణాలను వదిలించుకున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఆ తర్వాత లిస్టులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలున్నట్టు ఆర్బీఐ ఇచ్చిన గణాంకాల్లో కనిపిస్తున్నది.
పేద, మధ్యతరగతికి చెందిన సామాన్య రుణగ్రహీతలు.. బ్యాంకుల నుంచి తీసుకున్న అరకొర అప్పుల్ని బాధ్యతగా చెల్లిస్తుంటే, వందలు-వేల కోట్ల రూపాయల్లో పొందిన లోన్లను ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు కార్పొరేట్ కేటుగాళ్లు. బ్యాంకులు కూడా కామన్ కస్టమర్లపై కొరడా ఝుళిపిస్తూ.. అసలు సిసలైన మోసగాళ్లను ఊరికే వదిలేస్తున్నాయి. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసినవారిలో మొదటి 10 మంది వాటా గత ఏడాది మార్చి 31నాటికి రూ.40,635 కోట్లుగా ఉన్నది. ఇందులో ముగ్గురిదే దాదాపు సగానికి సమానం కావడం గమనార్హం. ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్ అత్యధికంగా రూ.6,695 కోట్ల రుణాలను ఎగ్గొట్టింది. ఇదిలావుంటే గత కొన్నేండ్లుగా దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్టు మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ముఖ్యంగా 2021-22లో రూ.457.44 లక్షల కోట్లుగా ఉన్న రిటైల్ డిజిటల్ పేమెంట్స్.. 2024-25లో రూ.849.12 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 81 శాతం రిటైల్ డిజిటల్ పేమెంట్స్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారానే జరిగాయని, ఇది ప్రపంచంలోనే గరిష్ఠమన్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సమన్వయంతో తీసుకున్న చర్యలే ఇందుకు కారణమన్నారు.
