న్యూఢిల్లీ, డిసెంబర్ 18: గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,500 మోసపూరిత యాప్స్ను తొలగించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మోసపూరిత రుణ యాప్స్ను కట్టడి చేయడానికి ఆర్బీఐ, ఇతర రెగ్యులేటర్లు, వాటాదారులూ పలు కఠిన చర్యలు తీసుకుంటున్నారని లోక్సభలో మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వం కూడా కీలక చర్యలు తీసుకుందని, చట్టబద్ధత ఉన్న యాప్స్ను గుర్తించడం జరిగిందని, ఈ జాబితాను గూగుల్కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం పంపించినట్టు చెప్పారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 2021 నుంచి జూలై 2022 వరకు గూగుల్ 3,500 నుంచి 4 వేల వరకు లెండింగ్ యాప్స్ను నిశితంగా పరిశీలించిన తర్వాత వీటిలో 2,500 యాప్స్ను గుర్తించి ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు మంత్రి చెప్పారు. ది ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ), హోం మంత్రిత్వ శాఖ సంయుక్తంగా డిజిటల్ లెండింగ్ యాప్స్పై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ మోసపూరిత యాప్స్కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన ఉండాలని, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు సురక్షితమైన లావాదేవీలకు మొగ్గుచూపాలన్నారు. మరో ప్రశ్నపై మంత్రి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకం అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 44.46 కోట్ల ఖాతాలకు రూ.26.12 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు చెప్పారు.