దేశ ఆర్థిక వ్యవస్థ దిగాలు పడుతున్నది. యావత్తు ప్రపంచానికే భారత్ వెలుగు రేఖ అంటూ ఓవైపు మోదీ సర్కారు గొప్పలు చెప్తుంటే.. మరోవైపు వాస్తవ పరిస్థితులు మాత్రం ఇంకోలా ఉన్నాయి మరి.తాజా ఆర్థిక సర్వేనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ పడిపోతుందంటూ 6.5 శాతంగా అంచనా వేశారు. గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం కూడా తగ్గింది.
న్యూఢిల్లీ, జనవరి 31: దేశ వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) 6.5 శాతానికి నెమ్మదిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సర్వేను మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23) 7 శాతం జీడీపీని అంచనా వేశారు. అయితే గత ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే తక్కువే కావడం గమనార్హం. నాడు 8.7 శాతంగా ఉన్నది.
కాగా, పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ప్రకారం ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద దేశమని, ఎక్సేంజ్ రేటు దృష్ట్యా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని పేర్కొన్న కేంద్రం.. మిగతా దేశాల మాదిరిగానే భారత్ కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నదని ఈ సందర్భంగా చెప్పింది. ఇందులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కూడా ఉందన్నది. సరఫరా వ్యవస్థల్లో నెలకొన్న ఇబ్బందులతోనూ జీడీపీకి దెబ్బ పడిందన్నది. ఇదిలావుంటే ఈ మార్చి ఆఖరుకల్లా దేశ నామినల్ జీడీపీ దాదాపు 3.5 ట్రిలియన్ డాలర్లకు చేరనుందని ఆర్థిక సర్వేలో ప్రభుత్వం పేర్కొన్నది.
మందగమనమే: ఐఎంఎఫ్
భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఛాయలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అన్నది. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను దేశ వృద్ధిరేటును 6.8 శాతంగా అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) 6.1 శాతంగానే ఉండొచ్చన్నది. తాజా ఆర్థిక సర్వేలో ఈసారి 7 శాతం, వచ్చేసారి 6.5 శాతంగా జీడీపీ నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ అంతకంటే తక్కువే నమోదు కావచ్చని ఐఎంఎఫ్ అంటుండటం గమనార్హం. జనవరి నెలకుగాను మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్కు సంబంధించి ఐఎంఎఫ్ అప్డేట్ ఇచ్చింది.
తప్పుడు విధానాలే కారణమా..
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అనుసరిస్తున్న తప్పుడు విధానాలు దేశ వృద్ధిరేటు ఉసురు తీస్తున్నాయా? అంటే అవుననే అనిపిస్తున్నది. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి 2016-17లోనే భారత జీడీపీ గరిష్ఠ స్థాయిలో 8.3 శాతంగా నమోదైంది. ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ వస్తున్నది. 2017-18లో 6.8 శాతంగా, ఆ మరుసటి ఆర్థిక సంవత్సరం 6.5 శాతంగా ఉన్నది. ఇక 2019-20లోనైతే ఈ పదేండ్లలో ఎప్పుడూ లేనంతగా 3.7 శాతానికి క్షీణించింది. నిజానికి వృద్ధిరేటు పతనానికి కేంద్రం.. కరోనాను సాకుగా చూపుతున్నది. అయితే కరోనా 2020లో వచ్చింది. దీంతో 2019-20లో వృద్ధి పడిపోవడానికి కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. ఇక 2020-21లో జీడీపీ మైనస్ 6.6 శాతానికి క్షీణించగా, ఆ మరుసటి ఆర్థిక సంవత్సరం 8.7 శాతంగా ఉందంటూ మోదీ సర్కారు గొప్పలు చెప్పుకోవడం కూడా విమర్శలకు దారితీస్తున్నది. అంతకుముందు ఏడాది బేస్రేటు మైనస్లో ఉండటమే ఈ పెరుగుదలకు కారణమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. తగ్గిన ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.
ప్రధానాంశాలు