Budget 2023-24 | వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. కనుక మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్. సాధారణంగా ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలు, పన్ను మినహాయింపులు, సబ్సిడీలు ఉంటాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే ఐదో బడ్జెట్లో సబ్సిడీలకు కోత విధించే అవకాశాలే కనిపిస్తున్నాయి. వృద్ధిరేట్ పెంపుదలకు కేటాయింపులు పెరగనున్నాయని ఎకనమిస్ట్ల సర్వేలో తేలింది.
ద్రవ్యలోటును అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటి వరకు అమల్లో ఉన్న సబ్సిడీలకు విత్తమంత్రి నిర్మలమ్మ రాం రాం పలుకనున్నారని వినికిడి. ఆదాయం పన్ను రేట్లు, శ్లాబ్ల్లో సవరణలు చేయకపోవచ్చునని ఎకనమిస్ట్ల సర్వేలో తెలుస్తున్నది. ఫ్రీ-ఫుడ్ ప్లాన్ ఉపసంహరణ, ఎరువులకు సబ్సిడీలో కోత విధించడంతోపాటు నిర్మలా సీతారామన్ కొన్ని సామాజిక సంక్షేమ పథకాలకు మద్దతుగా నిధుల కేటాయింపులు జరుపుతారని సమాచారం.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రగతి రధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ శాఖలు, విభాగాలు, పథకాల నిర్వహణ ఖర్చు సుమారు 12.5 శాతం పెరుగుతుందని అంచనా. అది రూ.44.40 లక్షల కోట్లు ఉండొచ్చునని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా ఉన్న ద్రవ్యలోటును 5.9 శాతానికి తేవాలని కేంద్రం భావిస్తున్నట్లు సర్వే మేడియన్ తెలిపింది. దీనికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన రుణాల కంటే 11 శాతం అధికంగా రికార్డు స్థాయిలో రూ.15.8 లక్షల కోట్ల రుణాలు చేయనున్నది కేంద్రం.
ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపేణా వసూళ్లు ఆరోగ్యకరంగా కొనసాగుతున్నా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యానికంటే తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే వచ్చే ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ జరిగినా అభివృద్ధి పథకాల అమలుకు నిధులు సమకూరతాయని సర్కార్ భావిస్తుననట్లు సమాచారం.
ప్రపంచ ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తున్నదన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. పెరిగిన ధరల నియంత్రణకు అధిక వడ్డీరేట్లు పెంచడంతో దేశీయంగా ఇండ్ల కొనుగోలు డిమాండ్ పడిపోతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు, క్రెడిట్ రేటింగ్ సంస్థలు కూడా వచ్చే ఏడాది విపత్కర పరిస్థితుల నుంచి బయట పడేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బుధవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆమోదయోగ్యమైన ద్రవ్య నియంత్రణ రోడ్ మ్యాప్ అందిస్తారని ఆశాభావంతో ఉన్నారు.