హైదరాబాద్, అక్టోబర్ 27: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం రెండు రెట్లు పెరిగింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,511 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,848 కోట్లతో పోలిస్తే ఇంచుమించు రెండు రెట్లు పెరిగింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం పుంజుకోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది.
ఏడాది క్రితం రూ.22,958 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.28, 282 కోట్లకు ఎగబాకింది. గత త్రైమాసికంలో వడ్డీల ద్వారా రూ.24,587 కోట్లు సమకూరాయి. వీటిలో నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.89 శాతం ఎగబాకి రూ. 9,126 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.45 శాతం నుంచి 6.38 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ కూడా 2.64 శాతం నుంచి 1.30 శాతానికి దిగాయి.