Adani | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం ఆ గ్రూప్ షేర్లను కొంటూ పోతున్నది. ఆ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ భారీగా పడిపోయినా, ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చీమకుట్టినట్లయినా లేదు. పాలసీదార్ల సొమ్మును మరింతగా అదానీ గ్రూప్లో కుమ్మరిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ మరిన్ని షేర్లను కొని వాటా పెంచుకున్నది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్లో 3,57,500 షేర్లను తాజాగా ముగిసిన త్రైమాసికంలో కొన్నది. దీంతో ఈ కంపెనీలో బీమా సంస్థ వాటా 4.23 శాతం నుంచి 4.26 శాతానికి చేరుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీలకు అదానీ గ్రూప్ సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే 2023 జనవరి-మార్చిలో అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్లో సైతం ఎల్ఐసీ వాటా ను పెంచుకున్నది. మరోవైపు ఆదానీ గ్రూప్ ఇతర కంపెనీలు అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్లో వాటాను స్వల్పంగా తగ్గించుకోగా, ఏసీసీలో వాటా స్థిరంగా ఉంది.
పలు విలువైన కంపెనీల్లో అత్యధికంగా షేర్లను కొనుగోలు చేసే ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం తొలి నుంచీ అదానీ గ్రూప్ పట్ల జాగ్రత్త వహిస్తున్నాయి. దేశంలోని మ్యూచువల్ ఫండ్ స్కీమ్లన్నింటికీ కలిపి అదానీ ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్లో 2022 డిసెంబర్ 31నాటికి ఉన్న వాటా 1.19 శాతమే. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో ఫండ్స్ ఈ వాటాను సైతం గణనీయంగా తగ్గించివేశాయి. దీంతో 2023 మార్చి 31నాటికి ఇది 0.87 శాతానికి దిగివచ్చింది. ఇదే కంపెనీలో ఎల్ఐసీకి 4.26 శాతం వాటా ఉన్నది. ముగిసిన త్రైమాసికంలో దాదాపు 3 కోట్ల అదానీ పోర్ట్స్ షేర్లను ఫండ్స్ విక్రయించాయి. ఈ కంపెనీలో ఫండ్స్ వాటా 4.43 శాతం నుంచి 3.09 శాతానికి తగ్గింది. అదానీ పోర్ట్స్లో ఎల్ఐసీ వాటా 9.12 శాతం వాటా ఉంది. అంటే ఎంత మొత్తంలో అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు ఎంతగానో ఆసక్తి చూపించే సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్స్లో సైతం వాటాను కుదించుకున్నాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీలను గత ఏడాది అదానీ గ్రూప్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ఇది అదానీ గూటిలోకి రావడంతో ఫండ్స్ ఇందులో వాటాను శరవేగంగా 7.79 శాతం నుంచి 5.80 శాతానికి తగ్గించుకున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో అంతంతమాత్రంగా ఉన్న వాటాను సైతం ఫండ్స్ విక్రయించాయి. ఇందులో వాటా 0.12 శాతం నుంచి 0.09 శాతానికి తగ్గింది. అదానీ గ్రూప్లో పెట్టుబడులున్న మ్యూచువల్ ఫండ్స్ సంఖ్య కూడా 31 నుంచి 27కు తగ్గింది. జనవరిలో హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.19. 20 లక్షల కోట్ల నుంచి రూ.9.38 లక్షల కోట్లకు పడిపోయింది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ గత ఏడాది రూ.80,000 కోట్లకుపైగా ఉండగా, అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఈ విలువ నిట్టనిలువునా కుప్పకూలింది. ఈ ఏడాది జనవరి 24న హిండెన్బర్గ్ రిపోర్ట్ వెలువడగా, ఫిబ్రవరి మూడోవారానికల్లా అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.27,000 కోట్లకు పడిపోయింది. ఈ తరుణంలో అదానీ గ్రూప్ను రక్షించేందుకు అందులో పెట్టుబడులు చేయాలంటూ ఎల్ఐసీ, ఎస్బీఐలను కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసిందంటూ కాంగ్రెన్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అదానీ ఉదంతంపై పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపచేయడం, ఈ గ్రూప్పై ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనూ అదానీ గ్రూప్లో ఎల్ఐసీ వాటా పెంచుకోవడం గమనార్హం.