హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): దేశ ఔషధ రాజధానిగా, లైఫ్సైన్సెస్ హబ్గా పేరుగాంచిన హైదరాబాద్ కీర్తి రానున్న రోజుల్లో మసకబారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్మా, లైఫ్సైన్సెస్ పెట్టుబడుల విషయంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న హైదరాబాద్కు తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పోటీ మొదలైంది. దీనికితోడు హైదరాబాద్ ఫార్మాసిటీపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నది. దీంతో పలు కంపెనీలు యూపీ, ఏపీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషిచేస్తుంటే.. తెలంగాంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ‘నిమ్మకు నీరెత్తినట్టు’ వ్యవహరిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు బల్క్డ్రగ్ పార్కును మంజూరు చేసిన విషయం విదితమే. దీంతో ఏపీ ప్రభుత్వం రూ.1,235 కోట్లతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 2 వేల ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈపీసీ విధానంలో ఈ పార్కు నిర్మాణానికి బిడ్లు ఆహ్వానించింది. దీని ద్వారా రూ.14,340 కోట్ల పెట్టుబడులు రాబట్టడంతోపాటు అందులో ఏర్పాటయ్యే 100కుపైగా ఫార్మా పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 27,360 మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే ఏపీలో 300కుపైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఏటా రూ.41,500 కోట్ల విలువైన ఉత్పత్తులు జరుగుతున్నాయి.
ఫార్మా రంగంపై రేవంత్ సర్కారు ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 70కిపైగా ఔషధ కంపెనీలు యూపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. దీనికితోడు ఏపీలో బల్క్డ్రగ్ పార్కు ఏర్పాటైతే మన రాష్ట్రంలో ఫార్మా రంగానికి గడ్డు పరిస్థితి తప్పదన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఏపీకి ఓడరేవులు కూడా ఉండటం ఆ రాష్ర్టానికి సానుకూల అంశమని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్లో ఔషధ రంగానికి బలమైన ఎకోసిస్టం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలపై సందిగ్ధత నెలకొనడంతో పలు ఫార్మా కంపెనీలు ప్రత్యామ్నాయాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.
హైదరాబాద్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎటూ తేల్చడంలేదు. హైదరాబాద్ శివార్లలో సుమారు 16 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించిన గత ప్రభుత్వం.. అందులో ఇప్పటికే 13 వేల ఎకరాలు సేకరించింది. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు కూడా రావడంతో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించాలని అనేక ఫార్మా కంపెనీలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి కేటీఆర్ దావోస్, అమెరికా, లండన్లో పర్యటించినప్పుడు తెలంగాణలో ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతోపాటు ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. దీంతో హైదరాబాద్ ఫార్మాసిటీలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మౌలిక సదుపాయాలను, కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫార్మాసిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని గత ప్రభుత్వమే కేంద్రానికి డీపీఆర్లు కూడా సమర్పించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టగానే ఫార్మాసిటీని రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. దానికి బదులుగా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి కొత్త ప్రతిపాదన సమర్పిస్తామని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనను పక్కన పెట్టాలని కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తారా? లేక ప్రభుత్వ పెద్దల మదిలో మరేదైనా ఆలోచన ఉన్నదా? అనేది స్పష్టమవడంలేదు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బహుళజాతి కంపెనీల వల్ల రాష్ర్టానికి ఒరిగేదేమీ ఉండదని సెలవిచ్చారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ప్రోత్సహించేందుకు త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని చెప్పారు. దీంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్న కంపెనీలన్నీ పునరాలోచనలో పడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో ఫార్మా రంగం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.