Uco Bank | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూకో బ్యాంక్ (Uco Bank) సిస్టమ్లో సాంకేతిక లోపంతో బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో రూ.820 కోట్లు జమ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ యాజమాన్యం తగు చర్యలు చేపట్టడంతో రూ.649 కోట్లు రికవరీ అయ్యాయి. ఇమిడిటే పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) సిస్టమ్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిణామం తలెత్తినట్లు తెలుస్తున్నది.
పొరపాటు గుర్తించిన వెంటనే బ్యాంక్ యాజమాన్యం.. అలా క్రెడిట్ అయిన ఖాతాలను బ్లాక్ చేసింది. ఇప్పటి వరకు 79 శాతం మనీ వెనక్కు తేగలిగామని గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్లో యూకో బ్యాంక్ వెల్లడించింది. మరో రూ.171 కోట్లు వెనక్కు తెప్పించాల్సి ఉందని పేర్కొన్నది. ఈ సాంకేతిక లోపం ఏర్పడటానికి కారణం సిబ్బంది తప్పిదమా.. బ్యాంక్ ఖాతాల హ్యాకింగ్ జరిగిందా? అన్న విషయాలపై క్లారిటీ రాలేదు.
అసలు సంగతేమిటింటే ఈ నెల 10-13 తేదీల మధ్య ఐఎంపీఎస్లో సాంకేతిక లోపంతో పొరపాటున తమ బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో జమ అయ్యాయని యూకో బ్యాంక్ తెలిపింది. ఈ పొరపాటు వ్యవహారం ఈ నెల 15 (బుధవారం) బయటకు వచ్చింది. ఇతర బ్యాంకుల వినియోగదారుల పేమెంట్స్తో తమ ఖాతాదారుల అకౌంట్లలో సొమ్ము డిపాజిట్ అయినట్లు పేర్కొన్నది.ఐఎంపీఎస్ సిస్టం మినహా మిగతా సర్వీసులన్నీ యధాతథంగా కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయని వివరించింది.
తమ బ్యాంక్ శాఖల్లో మనీ డిపాజిట్ అయినా నిజంగా ఆయా ఖాతాల నుంచి సొమ్ము తమ బ్యాంకుకు రాలేదని తెలియడంతో ఐఎంపీఎస్ చానల్ నిలిపేశామని యూకో బ్యాంకు వివరించింది. ఈ అంశంపై దర్యాప్తు సంస్థల సాయం కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించింది. తాజా పరిణామం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో యూకో బ్యాంక్ షేర్లు గురువారం ఉదయం 10.20 గంటల సమయంలో బీఎస్ఈలో 1.03 శాతం నష్టంతో రూ.39.42 వద్ద ట్రేడ్ అయ్యాయి.