న్యూయార్క్ : ఆధునిక వ్యాపారాలను శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI startup) అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు వేదికవుతోంది. చాట్జీపీటీ ప్రారంభంతో ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్కు విశేష ఆదరణ లభిస్తోంది. ఏఐ సాయంతో నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని పలు కంపెనీలు న్యూ టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాయి. ఇక ఇద్దరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కేవలం రూ. 15,000తో చాట్జీపీటీని వాడుతూ ఏఐ స్టార్టప్ను ప్రారంభించగా, దాన్ని ఏకంగా రూ. కోటికి విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
టెక్నాలజీ, వినూత్న ఆవిష్కరణలు జీవితాన్ని ఎంతలా మార్చేస్తాయనేందుకు వారి ప్రస్ధానం సంకేతంగా చెబుతున్నారు. సాల్ ఐలో, మోనికా పవర్స్ ఓ ఈవెంట్లో కలుసుకుని ఇద్దరి అభిప్రాయాలూ కలవడంతో ఇద్దరూ కలిసి స్టార్టప్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 185 డాలర్లతో (రూ. 15,000) తమ ఏఐ ప్రాజెక్ట్ను చేపట్టారు. తొలినాళ్లలో మార్కెట్ పరిశోధన కోసం చాట్జీపీటీ సేవలను ఉపయోగించుకున్నారు. టెక్ స్టార్టప్స్కు సీటీవోగా పనిచేసిన అనుభవం ఐలోకు ఉపకరించగా, మస్కట్ అనే డిజైన్, బ్రాండింగ్ కంపెనీని పవర్స్ నడిపారు.
వీరిద్దరూ కలిసి ఏఐ ఆధారిత రీసెర్చ్ టూల్ను లాంఛ్ చేశారు. యువ వాణిజ్యవేత్తలు తమ బిజినెస్ ఐడియాస్కు పదునుపెట్టేందుకు డైమ్ఏడజన్ పేరుతో వారు స్టార్టప్ను షురూ చేశారు. సంప్రదాయ అనలిటిక్స్ ఏజెన్సీస్, సెర్చి ఇంజిన్స్ కంటే వేగంతో డైమ్ఏడజన్ 39 డాలర్లకే సమగ్ర రిపోర్ట్స్ అందించేలా డిజైన్ చేశారు. ప్రారంభించిన తొలినాళ్లలోనే డైమ్ఏడజన్ 66.000 డాలర్లను ఆర్జించింది. ఇక గత నెలలో డైమ్ఏడజన్ను అరోజ్మెనా, డేనియల్ డి కార్నెల్లీ దాదాపు రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. భార్యాభర్తలైన వీరు డైమ్ఏడజన్ను తమ పూర్తికాల ప్రాజెక్టుగా చేపట్టనున్నారు.
Read More :
Festive Season | మార్కెట్లకు పండుగల జోష్.. డిసెంబర్ 31 నాటికి రూ.8.5లక్షల కోట్ల టర్నోవర్..!