Twitter blue tick | ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ఇవాల్టి నుంచి ఇండియాలో అందుబాటులో వచ్చాయి. ఈ సేవలను పొందాలనుకునే వారు నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ యూజర్ల కోసం వార్షిక సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. ఇందులో డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్లూ సర్వీసులు అమెరికా, కెనడా వంటి కొన్ని ఎంపిక చేసిన దేశాల్లోనే లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ దేశాల జాబితాలో ఇండియా చేరిందని ట్విట్టర్ తెలిపింది.
ట్విట్టర్ బ్లూ ఎట్టకేలకు భారతదేశంలో అందుబాటులో వచ్చింది. చందా గత సంవత్సరం ప్రవేశపెట్టారు. అయితే అక్టోబర్ చివరలో ఎలోన్ మస్క్ కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత తిరిగి ఈ సర్వీసులను పునరుద్ధరించారు. గతంలో బ్లూ టిక్ను పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం ఈ విధానానికి స్వస్తి చెప్పిన సంస్థ.. సబ్స్క్రిప్షన్ పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంలో సంస్థకు రాబడి కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ వినియోగదారులు బ్లూ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అదే వెబ్ యూజర్లు నెలకు రూ.650కి చెల్లించాలి. వార్షిక సబ్స్క్రిప్షన్ తీసుకునే వెబ్ యూజర్లకు డిస్కౌంట్ లభిస్తుంది. వీరు ఏడాడికి రూ.7,800 బదులుగా రూ.6,800 చెల్లిస్తే సరిపోతుంది. వార్షిక సబ్స్క్రిప్షన్ ప్లాన్ మొబైల్ వినియోగదారులకు లేదు.
బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ వినియోగదారులు తమ ట్వీట్లను ఎడిట్ చేసుకునే వీలును పొందుతారు. పొడవైన, 1080పీలో వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. అలాగే, రిప్లై, మెన్షన్, సెర్చింగ్లో వీరికి ప్రాధాన్యత ఉంటుంది. సాధారణ వినియోగదారుల కంటే 50 శాతం తక్కువ అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తాయి. కొత్త ఫీచర్లకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. సబ్స్క్రైబర్లు తమ హ్యాండిల్, డిస్ప్లే పేరు లేదా ప్రొఫైల్ పిక్ను మార్చుకునే వీలు ఉంటుంది. అయితే, ఇలా చేసేవారికి తాత్కాలికంగా బ్లూ టిక్ను తొలగిస్తారు. కాగా, వ్యాపారాల కోసం అధికారిక లేబుల్ను గోల్డ్ చెక్మార్క్తో భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఖాతాలకు బూడిద రంగు చెక్మార్క్ ఇస్తారు.