70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి
సింగరేణి అధికారులకు సీఎండీ శ్రీధర్ దిశానిర్దేశం
అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, ఏప్రిల్ 6 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.30 వేల కోట్లకుపైగా టర్నోవర్ సాధించాలని సింగరేణి లక్ష్యంగా నిర్ణయించుకొన్నది. ఈ లక్ష్య సాధనకు సింగరేణి అధికారులంతా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సీఎండీ ఎన్ శ్రీధర్ పిలుపు ఇచ్చారు. రోజూ కనీసం 15 లక్షల ఘనపు మీటర్లకు తగ్గకుండా ఈ ఏడాది 540 మిలియన్ ఘనపు మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తి, 2022-23లో సాధించాల్సిన లక్ష్యాలపై బుధవారం ఆయన సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఎక్స్ప్లోజివ్స్ సమస్య తలెత్తినప్పటికీ అత్యధికంగా 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.26,600 కోట్ల టర్నోవర్ సాధించగలిగామన్నారు. ఈసారి రోజూ 9 మిలియన్ టన్నులకు తగ్గకుండా బొగ్గును ఉత్పత్తి చేయాలని సూచించారు. దీనితోపాటు భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు అన్ని గనుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరామ్, డీ సత్యనారాయణరావు, డీఎన్ ప్రసాద్, కే సురేంద్ర పాండే, జే ఆల్విన్, కే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.