TRAI : దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న స్పామ్, మోసపూరిత కాల్స్కు అడ్డుకట్ట వేసేందుకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ (Banking), ఆర్థిక సేవలు (Financial services), బీమా (Insurance) రంగంలోని సంస్థలతోపాటు ప్రభుత్వ విభాగాలు తమ సర్వీస్, లావాదేవీల కాల్స్ కోసం తప్పనిసరిగా ‘1600’ తో మొదలయ్యే నంబర్ సిరీస్ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఒకేసారి సిరీస్వల్ల వినియోగదారులు ఏది అసలైన కాల్, ఏది మోసపూరిత కాల్ అనేది సులువుగా గుర్తించగలుగుతారు. ఈ కొత్త నిబంధనను దశలవారీగా అమలు చేసేందుకు ట్రాయ్ గడువులు నిర్దేశించింది. వాణిజ్య బ్యాంకులు (ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ) 2026, జనవరి 1 నాటికి ఈ సిరీస్కు మారాల్సి ఉంటుంది. రూ. 5,000 కోట్లకు పైగా ఆస్తులున్న పెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు 2026, ఫిబ్రవరి 1 గడువుగా విధించారు.
మ్యూచువల్ ఫండ్లు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు 2026, ఫిబ్రవరి 15 వరకు సమయం ఇచ్చారు. మిగిలిన ఎన్బీఎఫ్సీలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు 2026, మార్చి 1 తుది గడువుగా నిర్ణయించారు. క్వాలిఫైడ్ స్టాక్బ్రోకర్లు , 2026 మార్చి 15 నాటికి కొత్త సిరీస్కు మారాలి. ఇప్పటికే దాదాపు 485 సంస్థలు ‘1600’ సిరీస్లో 2800కి పైగా నంబర్లను వినియోగిస్తున్నాయని ట్రాయ్ తెలిపింది.
అయినప్పటికీ కొందరు ఇప్పటికీ పాత 10-అంకెల నంబర్లను వాడుతూ ఉండటంతో మోసాలకు ఆస్కారం ఏర్పడుతోందని భావించిన ట్రాయ్ ఈ మార్పును తప్పనిసరి చేసింది. ఇక బీమా రంగానికి సంబంధించిన గడువుపై ఐఆర్డీఏఐతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని ట్రాయ్ పేర్కొంది. ఈ కొత్త నిబంధన అమలుతో వినియోగదారుల ఆర్థిక భద్రత మెరుగుపడటంతో పాటు, సంస్థల పేరుతో జరిగే మోసపూరిత కాల్స్కు అడ్డుకట్ట పడనుంది.