ఈ ఏడాది పెరగనున్న జీతాలు
9 శాతం పెంపు ఉండొచ్చంటున్న సర్వే
న్యూఢిల్లీ, మే 19: ఉన్నత, సీనియర్ ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది పెరగనున్నాయి. 8.9 శాతం పెరగవచ్చని ఓ తాజా సర్వే చెప్తున్నది. గడిచిన ఐదేండ్లలో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. కరోనా మహమ్మారి దెబ్బకు పడిపోయిన దేశీయ వ్యాపారాలు తిరిగి కోలుకుంటుండటంతో పైస్థాయి సిబ్బందికిచ్చే వేతనాలను పెంచేందుకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఇయాన్ తెలిపింది. మధ్యశ్రేణి సీఈవో ప్యాకేజీ రూ.7 కోట్లపైనే ఉండొచ్చన్నది. దేశవ్యాప్తంగా 20కిపైగా రంగాల్లోని 475 సంస్థల అభిప్రాయాలతో 11వ వార్షిక ఎగ్జిక్యూటివ్ రివార్డుల సర్వేను ఇయాన్ చేపట్టింది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక మూలాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయని, వ్యాపార సెంటిమెంట్ పాజిటివ్గానే ఉందని సదరు సర్వే రిపోర్టులో చెప్పింది. ఈ క్రమంలోనే ఉన్నతోద్యోగుల జీతాల్లో ఈసారి 8.9 శాతం పెరుగుదల ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని తెలియజేసింది. నిరుడు 7.9 శాతం పెంపు ఉన్నది.
చీఫ్లకు బొనాంజా
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో), చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐవో) హోదాల్లోని వారికి జీతాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. వేరియబుల్ పే, లాంగ్ టర్మ్ ఇన్సెంటీవ్లు సీఈవోల జీతాల్లో దాదాపు 60 శాతంగా, సీఎఫ్వో, సీవోవో, సీఐవోలతోపాటు సేల్స్ హెడ్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ వేతనాల్లో 50 శాతంపైగా ఉండనున్నాయి. ఇక సంస్థ వద్దనున్న నగదు నిల్వలు, ఆదాయం, లాభం, షేర్హోల్డర్ రిటర్న్ల వంటి వాటి ఆధారంగా జీతాల పెంపు ఉంటుందని ఇయాన్ వెల్లడించింది.
వలసలకూ చెక్
ఇటీవలికాలంలో పైస్థాయి సిబ్బంది భారీగా ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ఇతర సంస్థలకు వలసపోతున్నారు. దీంతో ఈ వలసల్ని అడ్డుకునేందుకు, ప్రతిభ-నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కాపాడుకునేందుకూ కార్పొరేట్లు జీతాల పెంపు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల్లో అసంతృప్తులకు తావులేకుండా పనితీరు ఆధారంగా సాలరీ హైక్లు ఇవ్వాలని చూస్తున్నారు. ప్రతీ సంస్థ తమ టాలెంటెడ్ ఎంప్లాయిస్ను ఎట్టిపరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దని గట్టి ప్రణాళికల్ని వేస్తున్నట్టు ఇయాన్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ సొల్యూషన్స్ సీఈవో నితిన్ సేథీ అన్నారు.