న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి నిర్మాణ రంగం కోలుకుంటున్నది. దేశంలోని టాప్-7 నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో నమోదైన ఇండ్ల అమ్మకాలే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్సహా 7 ప్రధాన నగరాలపై ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గతేడాది జూలై-సెప్టెంబర్తో పోల్చితే ఈసారి హౌజింగ్ సేల్స్ రెండింతలకుపైగా పెరిగి 62,800 యూనిట్లకు చేరాయి. రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలు నిరుడుతో చూస్తే 24,560 యూనిట్ల నుంచి 29,520 యూనిట్లకు పెరిగాయి. ఈ క్రమంలోనే గతంతో పోల్చితే అమ్మకాల్లో వృద్ధిపరంగా హైదరాబాద్ 408 శాతంతో టాప్లో ఉండగా, యూనిట్లపరంగా చూస్తే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ 20,965 యూనిట్లతో ప్రథమ స్థానంలో ఉన్నట్లు అనరాక్ తెలియజేసింది. ఇక ఈ జూలై-సెప్టెంబర్లో 7 ప్రధాన నగరాల వ్యాప్తంగా 64,560 కొత్త యూనిట్ల ప్రారంభం జరిగింది. నిరుడు 32,530 గానే ఉన్నాయి. అయినప్పటికీ అంచనాల కంటే తక్కువగానే ఉన్నాయి. 201 9లో ఈ నగరాల హౌజింగ్ సేల్స్ 2,61, 358 యూనిట్లుగా ఉన్నట్లు తెలిపింది. కరోనాతో 2020 లో అమ్మకాలు దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే.
మొత్తం 7 ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు సగటున 3 శాతం పెరిగినట్లు అనరాక్ ఈ సందర్భంగా తెలియజేసింది. నిరుడు క్యూ3లో చదరపు అడుగు రూ.5,600 పలికితే, ఈసారి రూ.5,760గా ఉన్నట్లు పేర్కొన్నది. కాగా, గృహ రుణాల వడ్డీరేట్లు తగ్గడం హౌజింగ్ సేల్స్ పెరుగడానికి దోహదం చేసినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పూరీ చెప్పారు. అలాగే ఐటీ, ఐటీ అనుబంధ, ఆర్థిక రంగాల్లో పెరిగిన నియామకాలు సైతం ఈ ఏడు నగరాల్లో హౌజింగ్ డిమాండ్ను అమాంతం పెంచేశాయని తెలిపారు. వర్క్ ఫ్రం హోం సైతం చాలా మందిని సొంతింటి వైపు నడిపించిందన్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఇండ్లకూ గిరాకీ ఏర్పడిందని వివరించారు. ఇక వేగంగా జరుగుతున్న వ్యాక్సినేషన్తో కొనుగోలుదారులు సైట్లకు రావడం మళ్లీ పెరుగుతున్నదని వెల్లడించారు.