ముంబై, ఆగస్టు 30: బుల్ జోరు కొనసాగుతున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరుపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లు భారీగా లాభపడం, రూపాయి ఎగబాకడం సూచీలకు మరింత జోష్పెంచింది. ఇంట్రాడేలో 56,958.27 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ చివరకు 765.04 పాయింట్లు లేదా 1.36 శాతం లాభపడి 56,889.76 వద్ద ముగిసింది. ముగింపు కూడా సూచీలకు రికార్డు కావడం గమనార్హం. వరుసగా మూడోరోజు సూచీలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం మరో మైలురాయికి చేరుకున్నది. వరుసగా ఆరు రోజులుగా లాభాల్లో కదలాడుతున్న నిఫ్టీ సోమవారం మరో 225.85 పాయింట్లు(1.35 శాతం) ఎగబాకి రికార్డు స్థాయి 16,931.05 వద్ద ముగిసింది. రెండు సూచీలు మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించాయి. సెన్సెక్స్ 57 వేలు, నిఫ్టీ 17 వేల స్థాయికి చేరుకున్నాయి. గత శుక్రవారం 56 వేల మార్క్కు చేరుకున్న సూచీలు ఆ మరుసటి రోజే 57 వేలకు చేరుకోవడం విశేషం.
రూ.3.56 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్ల భారీ ర్యాలీతో మదుపరుల సంపద అమాంతం పెరిగింది. పండుగ సీజన్ కంటే ముందుగానే మదుపరులు లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. సోమవారం ఒకేరోజు రూ.3.56 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటల్ విలువ రూ.247 లక్షల కోట్లకు చేరుకున్నది. వరుసగా మూడు రోజుల్లో మదుపరుల సంపద రూ.5.76 లక్షల కోట్ల మేర పెరిగినట్లు అయింది.
రెండు నెలల గరిష్ఠానికి రూపాయి
రూపాయి జిగేల్ జిగేల్మంటున్నది. వరుసగా మూడోరోజు సోమవారం 40 పైసలు పెరిగిన దేశీయ కరెన్సీ విలువ రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 40 పైసలు ఎగబాకి 73.29 వద్ద ముగిసింది. బాండ్ల కొనుగోలు తగ్గిస్తామన్న ఫెడరల్ రిజర్వు చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికా కరెన్సీ ఢీలాపడింది. దీంతో ఇతర కరెన్సీలు భారీగా పుంజుకుంటున్నాయి. దీనికితోడు దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కూడా తోడవడంతో కరెన్సీకి రెక్కలు వచ్చాయి. ఫారెక్స్ మార్కెట్లో 73.46 వద్ద ప్రారంభమైన మారకం విలువ ఇంట్రాడేలో 73.21 గరిష్ఠ స్థాయి, 73.54 కనిష్ఠ స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. చివరకు 40 పైసలు లాభపడి 73.29 వద్ద స్థిరపడింది. జూన్ 14 తర్వాత కరెన్సీకి ఇదే గరిష్ఠస్థాయి కావడం గమనార్హం. గడిచిన మూడు సెషన్లలో మారకం విలువ 95 పైసలు బలపడింది. ఇప్పట్లో వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవని ఫెడరల్ రిజర్వు ఇచ్చిన సంకేతాలు ఇతర కరెన్సీలకు ఆక్సిజన్లా పనిచేశాయి.