Gold Rate | గతవారం రోజులుగా తగ్గిన బంగారం ధర సోమవారం మళ్లీ పెరిగింది. భారత్ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.800 పెరిగి రూ.57,415 వద్ద నిలిచిందని ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) తెలిపింది. 18 క్యారట్ల బంగారం తులం ధర రూ.43,061 వద్ద నిలిచిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా తెలిపారు. ఇజ్రాయెల్పై పాలస్తీనా హమాస్ దాడుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలతో బంగారం, ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇన్వెస్టర్లకు సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ మార్గంగా బంగారం నిలిచింది.మరో వైపు కిలో వెండి ధర రూ.1800 పెరిగి రూ.68,984 వద్ద నిలిచింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.67,095 వద్ద ముగిసింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతాయని, తద్వారా బంగారం, వెండి ధరలు పైపైకి దూసుకెళ్తాయని అనూజ్ గుప్తా వెల్లడించారు. దీంతో సమీప భవిష్యత్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.58 వేల మార్క్ను దాటేస్తుంది, కిలో వెండి ధర రూ.70 వేల పై చిలుకు నమోదవుతుందని చెప్పారు.