Bank Service Charges | టెక్నాలజీ డెవలప్ కావడంతోపాటు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఆదాయ వనరులు పెరగడంతో ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఆఫ్లైన్లోనూ, ఆన్లైన్లోనూ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ట్రాన్సాక్షన్లపై ఎస్సెమ్మెస్, నిధుల బదిలీకి ఐఎంపీఎస్, చెక్ క్లియరెన్స్, ఏటీఎం విత్డ్రాయల్ ఫెసిలిటీ తదితర సర్వీసులను బ్యాంకులు అందించాయి. ఈ సర్వీసులన్నీ ఇప్పటి వరకు ఉచితంగానే అందుకున్నారు బ్యాంకుల ఖాతాదారులు.. ఇటీవల ప్రతి వస్తువు క్రయ విక్రయాలపైనా.. ప్రతి సర్వీస్పైనా పన్ను.. చార్జీలు సహజ సిద్ధంగా మారాయి. ఆ బాటలో బ్యాంకులు కూడా పయనిస్తున్నాయి. ఇక నుంచి ఖాతాదారులకు అందించే ప్రతి సర్వీస్పైనా బ్యాంకులు చార్జీలు వసూలు చేయనున్నాయి. ఏడు రకాల బ్యాంకింగ్ సర్వీసులపై మీ జేబు నుంచి చార్జీలు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. అవేమిటో ఓ లుక్కేద్దామా..!
ప్రతి బ్యాంకులోనూ నగదు లావాదేవీల ఫెసిలిటీ ఉంది. కానీ ప్రతి నగదు లావాదేవీపైనా నిర్దిష్ట పరిమితి ఉంది. ఫిక్స్డ్ లిమిట్లోనే ప్రతి బ్యాంకు ఖాతాదారుడు నగదు లావాదేవీలు జరుపాలి. ఆ లిమిట్ దాటితే మీరు సర్వీస్ చార్జీ చెల్లించాల్సిందే. ఆయా బ్యాంకుల నిబంధనలను బట్టి సదరు సర్వీస్ చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఖాతాదారులకు నగదు లావాదేవీలకు రూ.20 నుంచి రూ.100 వరకు వడ్డిస్తాయి.
బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో ఖాతాదారు నిర్దిష్ట మొత్తం కనీస బ్యాలెన్స్ డబ్బు ఉంచాలి. ఒకవేళ, నిర్ధిష్ట మొత్తం కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే.. మీరు మినిమం బ్యాలెన్స్ చార్జీ పే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు ఉండాలనుకుందాం. అలా కనీస మొత్తం నిల్వను మెయిన్టైన్ చేయలేదనుకో.. అందుకు చార్జీ చెల్లించాల్సిందే. బ్యాంకులను బట్టికనీస మొత్తం నిల్వల నిబంధనలో తేడాలు ఉన్నా.. చార్జీల వడ్డింపు మాత్రం తప్పనిసరి.
ఇప్పటి వరకు అన్నిబ్యాంకుల్లో నెఫ్ట్ ( NEFT ), ఆర్టీజీఎస్ ( RTGS ) సేవలు ఉచితం. కానీ, అత్యధిక బ్యాంకులు ఐఎంపీఎస్ లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆయా బ్యాంకులను బట్టి ఐఎంపీఎస్ చార్జీలు రూపాయి నుంచి రూ.25 వరకు చార్జీలు వడ్డిస్తున్నాయి.
మీరు రూ. లక్ష వరకు చెక్ క్లియరెన్స్కు పంపితే ఏ బ్యాంకు కూడా చార్జీ వసూలు చేయదు. అంతకంటే ఎక్కువమొత్తం విలువ గల చెక్ క్లియరెన్స్కు మాత్రం క్లియరెన్స్ చార్జీ పే చేయాల్సి వస్తుంది. ఈ క్లియరెన్స్ చార్జీ రూ.150 వరకు ఉండొచ్చు. ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాదారులకు కేవలం 10 చెక్లు మాత్రమే ఉచితంగా సరఫరా చేస్తుంది. అంతకంటే ఎక్కువ మొత్తం చెక్లు కావాల్సి వస్తే మనీ పే చేయాల్సిందే.
నిర్ధిష్ట టైం వరకు మాత్రమే ఏటీఎం నుంచి నగదు విత్డ్రాయల్ ఉచితంగా అనుమతించే వారు. అలాగే నిర్ధిష్ట సంఖ్య గల లావాదేవీలు దాటితే మాత్రం బ్యాంకు చార్జీలు వసూలు చేస్తుంది. ఈ చార్జీలు బ్యాంకుల వారీగా వేర్వేరుగా ఉంటుంది. అత్యధిక బ్యాంకులు రూ.20-50 మధ్య చార్జీ వసూలు చేస్తాయి.
మీ సేవింగ్స్ అకౌంట్లో నగదు క్రెడిట్ లేదా డెబిట్ అయినప్పుడల్లా బ్యాంకు మీకు అలర్ట్ మెసేజ్ పంపుతుంటుంది. ఇలా ఖాతాదారులకు పంపే అలర్ట్ మెసేజ్లకు కూడా బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. కానీ, ఇలా ఎస్సెమ్మెస్లపై బ్యాంకులు వసూలు చేసే చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంక్ నెలవారీగా రూ.5, ఐసీఐసీఐ బ్యాంకు రూ.15 వసూలు చేస్తూ ఉంటుంది. బ్యాంకుల వారీగా ఎస్సెమ్మెస్ చార్జీ వసూళ్లు వేర్వేరుగా ఉంటాయి.
మీరు ఒకవేళ డెబిట్ కార్డు కోల్పోయారనుకుందా.. అప్పుడు మరో డెబిట్ కార్డు తీసుకోవాలంటే చార్జీ చెల్లించాల్సిందే. అలా కోల్పోయిన డెబిట్ కార్డు స్థానంలో మరో కార్డు పొందాలంటే రూ.50 నుంచి రూ.500 మధ్య చార్జీ పే చేయక తప్పదు. బ్యాంకుల వారీగా డెబిట్ కార్డులు జారీ చేయడానికి చార్జీలు వేర్వేరుగా ఉంటాయి.