RBI-Paytm | పేటీఎంపై తీసుకున్న చర్యలపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహించడంలో భారత ప్రముఖ పోషించిందన్నారు. పేటీఎంపై తీసుకున్న చర్యలపై ఆయన మాట్లాడుతూ సమగ్ర మదింపు తర్వాతే నియంత్రిత సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. పేటీఎం పేమెంట్ బ్యాంక్పై తీసుకున్న చర్యలను పునఃసమీక్షించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ వారంలో ఎఫ్ఏక్యూ జారీ చేస్తామని, అప్పటి వరకు అందరూ వేచి చూడాలని కోరుతున్నానన్నారు. బ్యాంక్ అయినా, పేమెంట్ బ్యాంక్, కో ఆపరేటివ్ బ్యాంక్ అయినా ఆర్బీఐ తగిన చర్చలు, పలు ప్రక్రియల అనంతరమే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
పేటీఎం మాత్రమే కాదు.. సాధారణంగా ఎవరిపైనైనా చర్యలు తీసుకునే తీసుకున్నప్పుడు నెలలు, ఏళ్ల తరబడి సంప్రదింపులు జరుపుతామని శక్తికాంత దాస్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో సమీక్షకు తావుండదన్నారు. వినియోగదారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకూడదనేది మా ప్రాధాన్యత అని.. అందుకే తాము నెల రోజులు సమయం ఇచ్చినట్లు తెలిపారు. జనవరి 31న చర్యలు తీసుకున్నామని.. కస్టమర్ ఇంట్రెస్ట్ ముఖ్యం కాబట్టి నెల రోజుల సమయం (ఫిబ్రవరి 29 వరకు) ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో శక్తికాంత దాస్ సైతం పాల్గొన్నారు.