న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు.. ఇటు బ్యాంకుల్లో డిపాజిటర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పెట్టుబడి పెట్టిన షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్నదని మదుపరులు.. అదానీకిచ్చిన రుణాల వసూళ్లపై డిపాజిటర్లు దిగులు పెట్టుకున్నారు. అమెరికాకు చెందిన షార్ట్-సెల్లర్ హిండెన్బర్గ్.. అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయని, ఆ కంపెనీల షేర్ల విలువ 85 శాతం బూటకమని గత నెల 24న ఓ రిపోర్టును విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆ మరుసటి రోజు నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలుతుండగా.. కేవలం వారం రోజుల్లో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మరోవైపు అదానీ సంస్థలకిచ్చిన అప్పులపై ఆందోళనల్ని డిపాజిటర్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు ఎస్బీఐ, బీవోబీ, పీఎన్బీలు రూ.39,380 కోట్ల రుణాలను ఇచ్చినట్టు తెలుస్తున్నది. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థలు ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్లు మరో రూ.20,000 కోట్లపైనే ఇచ్చినట్టు సమాచారం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అదానీ సంస్థలకిచ్చిన రుణాలు దాదాపు రూ.27,000 కోట్లుగా ఉన్నాయి. బ్యాంకు మొత్తం రుణాల్లో ఇది 0.9 శాతానికి సమానం.
బ్యాంక్ ఆఫ్ బరోడా:
కార్పొరేట్ రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ పెట్టిన పరిమితిలో నాల్గో వంతు మాత్రమే అదానీకి ఇచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తెలిపింది. రూ.5,380 కోట్లు రావాల్సి ఉందన్నది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్:
అదానీ గ్రూప్ సంస్థలకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.7,000 కోట్ల అప్పులను ఇచ్చింది. ఇందులో రూ.2,500 కోట్లు ఎయిర్పోర్టు వ్యాపారాలకిచ్చినదే.
ఇండస్ఇండ్ బ్యాంక్:
ఇండస్ఇండ్ బ్యాంక్ మొత్తం రుణాలు రూ.29 లక్షల కోట్లుగా ఉంటే.. అందులో 0.5 శాతం అదానీ గ్రూప్నకు చెందినవి. రూ.14,500 కోట్ల బాకీలున్నట్టు బ్యాంక్ తెలిపింది.
యాక్సిస్ బ్యాంక్:
అదానీ సంస్థలకు యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన రుణాలు.. ఆ బ్యాంక్ మొత్తం రుణాల్లో 0.94 శాతంగా ఉన్నాయి. నిధుల ఆధారిత రుణాలు 0.29 శాతం, నిధులేతర రుణాలు 0.58 శాతమని వివరించింది.