Telecom | న్యూఢిల్లీ, జనవరి 30: భారతీయ టెలికం రంగంలో గుత్తాధిపత్యం నడుస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలున్నా.. ప్రైవేట్ రంగ సంస్థలదే హవా. ఇదే ఇప్పుడు దేశంలో మొబైల్ వినియోగదారుల పాలిట శాపంలా తయారైంది. టెల్కోల అప్డేట్ ప్లాన్లు.. కస్టమర్లకు గుదిబండలుగా పరిణమిస్తున్నాయి మరి. ఆయా టెలికం సంస్థల పోకడ.. యూజర్లను బలవంతంగా అప్డేట్ వెర్షన్కు మారేలా చేస్తున్నది.
దేశంలో మొబైల్ ఫోన్లు పరిచయమైన తొలినాళ్లలో ఇన్కమింగ్ కాల్స్కూ చార్జీలు పడేవి. ఆ తర్వాత ఔట్గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లపైనే చార్జీలుండగా.. ఇప్పుడు డాటాకు మాత్రమే చెల్లిస్తున్నాం. తీసుకునే డాటా ప్లాన్, కాలపరిమితినిబట్టి ధరలుంటున్నాయి. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు అపరిమితంగానే లభిస్తున్నా.. వీటికి విలువే లేకుండాపోయింది. మొబైల్ ఫోన్ ఇప్పుడు ఇంటర్నెట్ సాధనం అయ్యిందిమరి. టెలికం సంస్థల టెక్నాలజీ ఊపుతో సూపర్ కంప్యూటర్గానే ఆవిర్భవించిందన్నా అతిశయోక్తి కాదు. ఓటీటీల రాకతో స్మార్ట్ టీవీలకూ మొబైల్స్ చెక్ పెట్టేస్తున్నాయి. ఇక నాడు కీలక భూమిక పోషించిన ఎస్ఎంఎస్లను నేడు వాడుతున్నవారైతే దాదాపుగా కనుమరుగైపోయారు. అంతా వాట్సాప్నే వినియోగిస్తున్నారు. వాయిస్ కాల్స్కు బదులు వీడియో కాల్స్ చేసుకుంటున్నవారి సంఖ్యా పెరిగిపోతున్నది. దీంతో డాటాకు ప్రాధాన్యత ఏర్పడింది. రోజుకు 1.5 జీబీ, 2 జీబీ డాటా కస్టమర్లే అధికం. 3 జీబీ డాటా యూజర్లూ ఉంటున్నారు. ప్లాన్ రేటు ఎంత పెరిగినా బఫరింగ్ను మాత్రం భరించలేకపోతున్నారు మరి.
ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్ఫోన్లలో ఇంచుమించుగా అన్నీ డ్యూయల్ సిమ్ మొబైల్సే. కానీ టెలికం సంస్థల టారీఫ్లతో అంతా సింగిల్ సిమ్కే పరిమితమవుతున్నారు. మరో సిమ్ను మెయింటేన్ చేయాలంటేనే జంకుతున్నారు. నిజానికి రెండు, మూడేండ్ల కిందటిదాకా కూడా ఒకొక్కరు రెండు, ఇంకొందరైతే మూడు ఫోన్ నంబర్లనూ యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో డ్యూయల్ సిమ్ ఆప్షన్కు అర్థమే లేకుండా పోయింది.
గతంలో రీచార్జ్తో సంబంధం లేకుండా ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు రీచార్జ్ చేస్తేనే ఔట్గోయింగ్ కాల్స్తోపాటు ఇన్కమింగ్ కాల్స్కూ వీలున్నది. దీంతో కాల్స్ చేయాల్సిన అవసరం లేకున్నా.. ఇన్కమింగ్ కాల్స్ కోసమైనా రీచార్జ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ఇది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నది. కొందరు స్మార్ట్ఫోన్ యూజర్లకూ చికాకు తెప్పిస్తున్నది. తిన్నా, తినకున్నా.. ఫోన్లో బ్యాలెన్స్లు వేయాల్సి వస్తున్నది మరి.
4జీ రాకతో 2జీ, 3జీ స్మార్ట్ఫోన్లకు గుడ్బై చెప్పిన వినియోగదారులు.. ఇప్పుడు 5జీ వెనుక పరుగులు పెడుతున్నారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే మొబైల్స్ అన్నీ కూడా 5జీ టెక్నాలజీతోనే వస్తున్నాయి. అయితే ఎంతో అప్డేట్ వెర్షన్ అయినప్పటికీ 5జీకి పనికిరాదన్న ఒకే ఒక్క కారణంతో 4జీ మొబైల్స్ను కొందరు యూజర్లు పక్కకు పడేస్తున్నారు. కానీ టెలికం సంస్థల తీరుతో ఇంకొద్ది రోజుల్లోనే అంతా తమకు ఇష్టం లేకున్నా.. టెలికం సేవల కోసం 5జీకి బలవంతంగా మారే పరిస్థితులు రాబోతున్నాయని ఇండస్ట్రీ అనలిస్టులు అభిప్రాయపడుతుండటం ఇప్పుడు ఒకింత కలవరపెడుతున్నది. ప్రభుత్వ రంగ టెలి కం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇంకా పూర్తిస్థాయిలో 4జీని సంతరించుకోక ముందే.. ప్రైవేట్ రంగ సంస్థలు 5జీ సేవల్ని ప్రారంభించేశాయి.
బీఎస్ఎన్ఎల్కు కాకుండా 5జీ స్పెక్ట్రం వేలంలో ప్రైవేట్ రంగ సంస్థలకు పెద్దపీట వేసిన కేంద్ర ప్రభుత్వానిదే ఈ పాపం అని పలువురు మండిపడుతున్నారు. ఇక లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్న స్పెక్ట్రంపై ఆదాయా న్ని పెంచుకోవాలని చూస్తున్న టెల్కోలు.. 2జీ, 3జీ సర్వీసుల్ని ఆపేస్తామంటున్నాయి. కస్టమర్లు 4జీకి మారాల్సిందేనని చెప్పుకొస్తున్నాయి. ఇప్పటికే అన్నీ ఒక్కటై ట్రాయ్పై వ్యూహాత్మకంగా ఒత్తిడి తెచ్చి టారీఫ్లను పెంచుకున్న కంపెనీలు.. 2జీ, 3జీ కస్టమర్లను బలవంతంగా 4జీకి రప్పించాలని ప్రయత్నిస్తున్నాయి మరి. అయితే కొంత కాలానికి 4జీ సంగతీ ఇంతేనన్నది నమ్మలేని నిజం. కానీ ఇప్పటికి కూడా కోట్లాది మంది ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. వీరందరికీ నిజంగా డాటా అవసరమే లేదు.
టెలికం సంస్థలు కుమ్మక్కై చేస్తున్న పనులు ఇలాంటి వారిపై మోయలేనంత భారాన్ని వేస్తున్నాయన్న ఆందోళనలు సర్వత్రా వినిపిస్తున్నాయిప్పుడు. ధరలు తగ్గించి స్మార్ట్ఫోన్లు అందరికీ లభించేలా చర్యలు తీసుకోవాలని టెలికం సంస్థలు కేంద్రాన్ని కోరుతుండటం కొసమెరుపు. అయితే ఫోన్ కొన్న తర్వాత డాటా ప్లాన్ల కొనుగోలు సంగతేంటన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. మొత్తానికి ఒకప్పుడు 10కిపైగా టెలికం సంస్థలతో పోటాపోటీగా సాగిన మార్కెట్లో వినియోగదారుడే కింగ్. ఇప్పుడు మాత్రం ప్రైవేట్ కంపెనీలదే రాజ్యం. ప్రభుత్వ సంస్థలు నామమాత్రమైతే ఇంతకన్నా ఏం జరుగుతుంది మరి.