న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సిద్ధమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల ఈ సమీక్ష మంగళవారం మొదలవగా.. గురువారం నిర్ణయం వెలువడనున్నది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత స్థాయిని దాటి హై లెవల్కు సమీపంలోనే ఉండటంతో ఈసారి కూడా కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంగా రెపోరేటును 6.5 శాతం వద్దే ఆర్బీఐ ఉంచుతున్నది.
నిరుడు ఫిబ్రవరి సమీక్షలో చివరిసారిగా రెపోరేటును ఆర్బీఐ పావు శాతం పెంచింది. దీంతో 6.25 శాతం నుంచి 6.5 శాతానికి చేరింది. అప్పట్నుంచి ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా సమీక్షల్ని నిర్వహిస్తున్న ఆర్బీఐ.. ఈ రేట్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై నెలలో గరిష్ఠంగా రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతంగా నమోదైంది. డిసెంబర్లో ఇది 5.69 శాతంగా ఉన్నది. ఆర్బీఐ ఆమోదిత స్థాయి 4-6 శాతం. దీంతో దీనికి దరిదాపుల్లోనే ఇంకా ధరల సూచీ ఉన్నందున ఈసారి సమీక్షలో కూడా రేట్లను ఎక్కడివక్కడే ఆర్బీఐ ఉంచుతుందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సైతం ఇదే అంచనాను వెలిబుచ్చుతున్నది.
ఈ ఏడాది జూన్లో లేదా ఆగస్టులో జరిగే ద్వైమాసిక ద్రవ్యసమీక్షల నుంచి వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టే వీలుందని ఎస్బీఐ అంచనా వేస్తున్నది. దీంతో ఏప్రిల్లో జరుగబోయే ద్రవ్యసమీక్షలో సైతం వడ్డీరేట్ల కోతకు అవకాశాల్లేవని తేలిపోతున్నది. వడ్డీరేట్లు తగ్గితే గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణగ్రహీతలకు ఊరట దక్కుతుంది. కానీ ఆర్బీఐ ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదు.