ముంబై, మార్చి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 17 ఏండ్ల తర్వాత తొలిసారిగా జపాన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారి అలజడి రేపింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతున్నదని వచ్చిన సంకేతాలు మదుపరులను అమ్మకాలవైపు నడిపించాయి. గ్లోబల్ మార్కెట్లకు తోడు దేశీయ సూచీలు కూడా అదే బాటపట్టాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు బ్లూచిప్ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం కూడా పతనానికి ఆజ్యంపోశాయి. ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఒక దశలో 72 వేల దిగువకు పడిపోయింది. చివర్లో ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది.
మార్కెట్ ముగిసే సమయానికి 736.37 పాయింట్లు లేదా 1.01 శాతం నష్టపోయి 72,012.05 వద్ద ముగిశాయి. మరో సూచీ నిఫ్టీ కూడా 238.25 పాయింట్లు కోల్పోయి తన కీలక స్థాయి 22 వేల దిగువకు 21,817.45 వద్ద ముగిసింది. ఈవారంలోనే అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనుండటం కూడా మదుపరులు వేచి చూసేదోరణి అవలంభించారు. స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.4,86,777.98 కోట్లు కోల్పోయి రూ.3, 73,92,545.45 కోట్లకు పరిమితమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు పతనానికి ప్రధాన కారణం టీసీఎస్. బ్లాక్డీల్ ద్వారా 2 కోట్ల టీసీఎస్ షేర్లను టాటా సన్స్ విక్రయించనున్నట్లు ప్రకటించడంతో కంపెనీ షేర్లు నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి. ఈ దెబ్బకు మిగతా ఐటీ రంగ షేర్లు కూడా కుప్పకూలాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీ షేర్లు భారీగా పతనం చెందాయి. వీటికి తోడు ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లె, పవర్ గ్రిడ్, ఐటీసీ, టాటా మోటర్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు కూడా దిగువకు పడిపోయాయి. కానీ, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వు ఈ వారమే నిర్ణయం తీసుకోనుండటం మదుపరుల్లో ఆందోళన పెంచింది.
బ్లాక్డీల్ ద్వారా 2 కోట్ల టీసీఎస్ షేర్లను టాటా సన్స్ విక్రయించడంతో టీసీఎస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. టీసీఎస్ షేర్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. ఈ దెబ్బకు ఐటీ రంగ షేర్లు కుదేలయ్యాయి.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గుచూపడం కూడా మరో కారణం.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా మదుపరుల్లో సెంటిమెంట్ను దెబ్బతీసింది. గత 17 ఏండ్లలో తొలిసారిగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్లను పెంచడం కూడా ఒక కారణం.
17 ఏండ్లలో తొలిసారిగా జపాన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. తీవ్ర ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్న దేశీయ సూచీలపై ఈ నిర్ణయం పిడుగు పడ్డట్టు అయింది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనావేసినదానికంటే అధికంగా నమోదుకావడంతో వచ్చే సమీక్షలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండటం కూడాఆందోళనను పెంచింది.
– వినోద్ నాయర్, జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్