న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మ్యూచువల్ ఫండ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపడానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సిద్ధమైంది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీఎస్) సూచనలకు అనుగుణంగా సెబీ ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తున్నది. మంగళవారం సెబీ బోర్డు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.
ఫండ్ల నిర్వహణ, బాధ్యత, మోస పూరిత లావాదేవీలు జరగకుండా ఉండేందుకు ఏఎంసీఎస్ పలు సూచనలు చేసింది. సెబీ బోర్డు సమావేశం కావడం ఇది 205వ సారి కాగా, అలాగే గత నెల రోజుల్లో ఇది రెండోది కావడం విశేషం. ఫండ్ స్కీంలలో ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, బాండ్ మార్కెట్లో రిటైల్ పెట్టుబడిదారులను ప్రోత్సహించడంలో భాగంగా డెబిట్ సెక్యూరిటీని లక్ష రూపాయల నుంచి రూ.10 వేలకు తగ్గించింది.