Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ సమర్పించింది. 2016 నుంచి తాము అదానీ గ్రూప్ కంపెనీలపై దర్యాప్తు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలు అబద్ధమని, ఆధారరహితమని తెలిపింది. హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాతనే అదానీ గ్రూప్ కంపెనీలపై నిఘా పెట్టినట్టు వివరించింది. అయితే, సెబీ.. సుప్రీంకు సమర్పించిన తాజా మదుపర్ల సంపదను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ నియంత్రణ సంస్థ అది.
తమ కష్టార్జీతం నీటిపాలు కాకుండా కాపాడుతుందని ప్రతి భారత మదుపరి నమ్మే సంస్థ అది. అందుకు తగ్గట్టుగానే.. గడిచిన 35 ఏండ్లలో ఎన్నెన్నో కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చింది కూడా. అయితే, రాజావారి ఆప్తమిత్రుడి కంపెనీలకు వచ్చేసరికి అదే సంస్థ ఇప్పుడు డొంకతిరుగుడు వైఖరిని ప్రదర్శించింది. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందే తప్పుడు అఫిడవిట్లను నిర్లజ్జగా సమర్పించింది. అదానీ గ్రూప్ కంపెనీలపై గతంలో ఎలాంటి దర్యాప్తు నిర్వహించలేదని అబద్ధాలు వల్లెవేసింది. అఫిడవిట్పై ప్రతిపక్ష పార్టీలతో పాటు మేధావులు, నెటిజన్లు మండిపడుతున్నారు. అదానీ గ్రూప్ విషయంలో సెబీ అబద్ధాలు వల్లె వేస్తున్నదని ధ్వజమెత్తారు.
మార్కెట్ నిబంధనలకు లోబడి అదానీ గ్రూప్ కంపెనీలు పనిచేస్తున్నాయో, లేదో తెలుసుకోవడానికి సెబీ దర్యాప్తు కొనసాగిస్తున్నదని కేంద్రమంత్రి పంకజ్ చౌదరీ 2021లో పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు. అదానీ గ్రూప్నకు సంబంధించి గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ (జీడీఆర్)పై జూన్ 16, 2016లో సెబీ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా అడిగిన ఐదు ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు ఇచ్చారు. అంతేకాదు. 1999 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో అదానీ స్టాక్ల్లో ప్రైస్ రిగ్గింగ్ జరిగిందని, ఈ ఉదంతంలో స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్, ఆయన సన్నిహితులతో పాటు అదానీ గ్రూప్ ప్రమోటర్ల హస్తం కూడా ఉన్నదని సెబీ గతంలోనే గుర్తించింది. సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా 2007లో రెండేండ్లపాటు అదానీ గ్రూప్పై నిషేధం విధించింది కూడా.
సుప్రీంకోర్టులో సెబీ తప్పుడు అఫిడవిట్ వేయడానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయంటూ ఎక్కడో అమెరికాలోని హిండెన్బర్గ్ అనే సంస్థ బయటపెట్టింది. ఒకవేళ తాము 2016 నుంచే అదానీ కంపెనీలపై దర్యాప్తు చేపడుతున్నట్టు వస్తున్న వార్తలను అంగీకరిస్తే, అదానీ అక్రమాలను ఎందుకు కనిపెట్టలేక పోయారన్న ప్రశ్నలు రావొచ్చని సెబీ ముందే గుర్తించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, ఈ అఫిడవిట్ వేసినట్టు అనుమానిస్తున్నారు. ఇక, అదానీ గ్రూప్ అవకతవకలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు నెలల దర్యాప్తు సమయం ఇప్పటికే ముగిసిపోయింది.
మరో ఆరు నెలల సమయం కావాలని కోర్టుకు సెబీ విజ్ఞప్తి చేసింది. అయితే, మూడు నెలలు మాత్రమే సమయం ఇవ్వగలమని ధర్మాసనం తేల్చిచెప్పింది. దీంతో అవాస్తవాలు నింపిన కొత్త అఫిడవిట్లను సమర్పించి గడువును మరింతగా పొడిగించి, కాలాయాపన చేయడానికే సెబీ ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నారు. అంతేకాదు, అదానీ అక్రమాల దర్యాప్తులో సెబీ వ్యవహరిస్తున్న తీరుపై తొలి నుంచి విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ ఏడాది జనవరిలో రూ.20 వేల కోట్ల ఎఫ్పీవోను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే హిండెన్బర్గ్ నివేదిక, తదనంతర పరిణామాల మధ్య ఫిబ్రవరి 1న అనూహ్యంగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్పీవోలో పాల్గొన్న సబ్స్కైబర్ల వివరాలు, ఎఫ్పీవో రద్దుకు కారణం ఏమిటని ఓ ఆర్టీఐ పిటిషన్ దాఖలైంది.
అదానీ కంపెనీలపై 2016 నుంచి ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని సెబీ చెప్పడాన్ని చూస్తే, 2021లో పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానం అబద్ధంగా భావించాలని నెటిజన్లు చెబుతున్నారు. ఒకవేళ, కేంద్రం సమాధానం నిజమైతే, సెబీ ఇప్పుడు అబద్ధాలు వల్లె వేస్తున్నట్టు మండిపడుతున్నారు. మొత్తానికి ఇద్దరిలో ఎవరో ఒకరు దొంగ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతుండగా, ఇద్దరూ తోడుదొంగలేనని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2016 నుంచి అదానీ గ్రూప్నకు చెందిన ఏ ఒక్క కంపెనీపై దర్యాప్తు చేపట్టలేదు: సోమవారం సుప్రీంకోర్టులో సెబీ అదానీ గ్రూప్పై సెబీ దర్యాప్తు నడస్తున్నది. 2016లోనే దీనికి సంబంధించి సెబీ ఓ ఆర్డర్ జారీచేసింది: 2021లో పార్లమెంట్లో కేంద్రం అదానీ స్టాక్లలో ప్రైస్ రిగ్గింగ్ జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. అదానీ గ్రూప్పై రెండేండ్ల నిషేధం: 2007 సెబీ సర్క్యులర్