ముంబై, జూన్15: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి కొత్త కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. బుధవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ కరెన్సీ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 18 పైసలు పతనమై 78.22 వద్ద ముగిసింది. ఇంత కనిష్టస్థాయిలో రూపాయి ముగియడం ఇదే ప్రథమం.
ఈ నెల 13న ఇది తొలిసారిగా 78 స్థాయి దిగువకు జారిపోయి, ఒకదశలో కొత్త ఆల్టైమ్ కనిష్టం 78.29 వద్దకు పడిపోయింది. అయితే ఆ రోజున రిజర్వ్బ్యాంక్ డాలర్లను సరఫరా చేయడంతో నష్టాల్లో కొంతవరకూ కోలుకుని, 78.04 వద్ద క్లోజయ్యింది. మంగళవారం ఫ్లాట్గా ముగిసిన తర్వాత తాజాగా మళ్లీ పతనాన్ని చవిచూసింది. రూపాయి అదేపనిగా తగ్గడానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. అవి..
యూఎస్ డాలర్ ఇండెక్స్ పదేపదే పెరుగుతూ ఆల్టైమ్ గరిష్టస్థాయి 105 దాటడంతో పలు ధనిక, వర్థమాన దేశాల కరెన్సీలు పతనమవుతున్నాయి. ఈ ట్రెండ్లో భాగంగా రూపాయి తరిగిపోతున్నది. ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ విలువను ఈ ఇండెక్స్ సూచిస్తుంది. రూపాయి క్షీణతతో దిగుమతుల ఖరీదవుతాయి. వస్తూత్పత్తుల ధరలు పెరుగుతాయి.
రూపాయి రూపంలో ఉన్న పెట్టుబడుల్ని ఇన్వెస్టర్లు విక్రయించి, డాలర్లలోకి మార్చుకోవడంతో రూపాయి పతనమవుతుంది. అలాగే ఎగుమతులకంటే దిగుమతులు ఎక్కువగా జరుపుతుంటే డాలర్ల రూపేణా చెల్లింపులు జరపాల్సిరావడం దేశీయ కరెన్సీ తరుగుదలకు కారణమవుతుంది.
అమెరికాలో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్టం 8.6 శాతానికి పెరగడంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తాజా పాలసీ మీట్లో 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఫెడ్ రేట్లను పెంచితే భారత్ వంటి వర్థమాన దేశాల ఆస్తులకంటే డాలర్ రూపంలో ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ చేసిన పెట్టుబడుల విలువ తగ్గిపోతుంది. దీంతో విదేశీయులు ఇక్కడి పెట్టుబడుల్ని విక్రయించి, తరలించుకుపోతారు. ఫలితంగా రూపాయి పడిపోతుంది.
ఉక్రెయిన్పై రష్యా సైనికదాడి జరిపిన తర్వాత ముడి చమురు ధరలు భగ్గుమనడం రూపాయిని దెబ్బతీసింది. దేశీ క్రూడ్ అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నందున, చమురు ధర పెరిగితే ఎక్కువ డాలర్లను దేశం వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో డాలర్కు డిమాండ్ పెరిగి, రూపాయి బలహీనపడుతుంది.
డాలర్ బలపడటంతో ఎఫ్పీఐలకు అటు స్టాక్ మార్కెట్లోనూ, ఇటు బాండ్లలోనూ నష్టాలు పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత స్టాక్ మార్కెట్ నుంచి రూ.17,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్నారు. 2022లో ఈ ఐదున్నర నెలల్లో రూ.1.81 లక్షల కోట్ల మొత్తాన్ని తరలించుకెళ్లారు. మార్కెట్లో ఈ విధంగా ఎఫ్పీఐలు అమ్మకాలు జరుపుతుంటే రూపాయి మరింతగా క్షీణిస్తుందని విశ్లేషకులు చెపుతున్నారు.