ముంబై, ఫిబ్రవరి 13: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ తన వృద్ధి లక్ష్యాల్ని భారీగా తగ్గించుకుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ ఆరోపణలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న అదానీ గ్రూప్ తిరిగి ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించుకునే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 15-20 శాతానికే పరిమితం చేసుకుంది. 2023-24లో ఆదాయాన్ని 40 శాతం పెంచుకోవాలన్నది అదానీ గ్రూప్ లక్ష్యం. అలాగే మూలధన పెట్టుబడి వ్యయాలను సైతం తగ్గించుకున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి నగదును ఆదా చేసుకోవడమే ప్రాధాన్యంగా గ్రూప్ భావిస్తున్నదని ఆ వర్గాలు వివరించాయి. మూలధన వ్యయాలను కనీసం 3 నెలలు నిలిపివేస్తే 3 బిలియన్ డాలర్ల వరకూ గ్రూప్ అదా చేసుకోగలుగుతుందని అంచనా. ఈ మిగులు.. రుణాల చెల్లింపు లేదా నగదు నిల్వలు పెంచుకోవడానికి ఉపకరిస్తుందంటూ గ్రూప్ భావిస్తున్నది. అయితే భవిష్యత్ ప్రణాళికలపై ప్రస్తుతం సమీక్ష జరుగుతున్నదని, వచ్చే కొద్ది వారాల్లో ఖరారు చేయనున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక వ్యక్తి తెలిపారు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అదానీ వ్యాపారాలు నేరుగా భారత ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉన్నందున ఈ గ్రూప్ పెట్టుబడుల్లో జాప్యం జరిగితే ఆర్థిక వ్యవస్థ మొత్తంమీద ప్రభావం చూపిస్తుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బార్క్లేస్ విడుదల చేసిన తాజా రిపోర్ట్లో పేర్కొంది. తమ పెట్టుబడులు భారీగా తగ్గితే దేశీ క్యాపెక్స్ సైకిల్ దెబ్బతింటుందని అదానీ గ్రూప్ సీఎఫ్వో జుగేషిందర్ సింగ్ సైతం గత నెలలో చెప్పారు. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఎఫ్పీవో జారీ అయిన సమయంలో జనవరి 29న జుగేషిందర్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎఫ్పీవో విజయవంతం కాకపోతే తాము వృద్ధి ప్రణాళికల్ని ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు వాయిదా వేసుకుంటామని తెలిపారు. అటుతర్వాత మూడు రోజులకు అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీవోను రద్దు చేసుకుంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ కారణంగా ఎఫ్పీవో రద్దుకావడంతో అదానీ విస్తరణకు బ్రేక్ పడింది.
సెంటిమెంట్ మెరుగుకు కసరత్తు
ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపర్చడానికి వచ్చే ఏడాదిలో రూ.5,000 కోట్ల రుణాల్ని చెల్లించాలని నిర్ణయించడంతోపాటు మరో 500 మిలియన్ డాలర్ల బ్రిడ్జ్ లోన్ను వచ్చే నెలలో అదానీ గ్రూప్ చెల్లించాలని ప్రయత్ని స్తున్నది. ఏసీసీ, అంబుజా సిమెంట్ టేకోవర్ కోసం అదానీ బ్రిడ్జ్ రుణాన్ని తీసుకున్నది.
బ్యాలెన్స్ షీట్స్ బాగున్నాయ్: అదానీ గ్రూప్
తమ పోర్ట్ఫోలియోలోని ప్రతీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ‘చాలా ఆరోగ్యకరం’గా ఉన్నదని అదానీ గ్రూప్ సోమవారం తెలిపింది. గ్రూప్ వృద్ధి లక్ష్యాన్ని, క్యాపెక్స్ను తగ్గించుకుందన్న వార్తల నేపథ్యంలో రాయిటర్స్ వార్తా సంస్థతో గ్రూప్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ అదానీ కంపెనీల క్యాష్ఫ్లో పటిష్ఠంగా ఉందని, తమ వ్యాపార ప్రణాళికలన్నింటికీ నిధులు సమకూర్చిఉన్నాయన్నారు. మార్కెట్ స్థిరపడిన తర్వాత ప్రతీ కంపెనీ తన సొంత క్యాపిటల్ మార్కెట్ వ్యూహాన్ని సమీక్షించుకుంటుందని తెలిపారు. షేర్హోల్డర్లకు మెరుగైన రాబడుల్ని అందించడంలో సామర్థ్యం పట్ల గ్రూప్ విశ్వాసం కలిగి ఉన్నదన్నారు.
కొనసాగిన షేర్ల పతనం
పలు ప్రతికూల వార్తల నడుమ సోమవారం సైతం అదానీ షేర్ల పతనం కొనసాగింది. గత వారంతంలో వరుసగా రెండు రోజులపాటు తీవ్రంగా నష్టపోయిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం ఇంట్రాడేలో 10 శాతం వరకూ తగ్గాయి. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఇంట్రాడేలో 10 శాతం క్షీణించి రూ.1,663 స్థాయిని తాకగా, అటుతర్వాత జరిగిన షార్ట్ కవరింగ్తో కొంతవరకూ కోలుకుంది. చివరకు 7 శాతం నష్టంతో రూ. 1,717 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 7.5 శాతం క్షీణించిన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ చివరకు 5.35 శాతం నష్టాన్ని చవిచూసింది. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అదానీ గ్రీన్, అదానీ పవర్, ఎన్డీటీవీలు ఎక్సేజీల లిమిట్ మేరకు 5 శాతం లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. ఇతర గ్రూప్ సంస్థలు అంబూజా సిమెంట్స్ 5.25 శాతం, ఏసీసీ 3 శాతం చొప్పున తగ్గాయి. అమెరికా ఫండ్ హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ స్టాక్స్ క్షీణించడం వరుసగా ఇది నాలుగోవారం. మధ్యలో ఒకటి రెండు రోజులు కోలుకున్నప్పటికీ, తిరిగి క్షీణబాట పట్టాయి. అదానీ గ్రూప్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లక్ష్యాన్ని, పెట్టుబడి వ్యయాలను తగ్గించుకుందన్న వార్తలతో తగ్గాయి.