కార్పొరేట్లు కట్టు తప్పకుండా కాపు కాయాల్సినవారే కాటేస్తున్నారు.
దశ-దిశలేని కేంద్ర పాలకుల దన్నుతో దర్యాప్తు సంస్థలే ఇప్పుడు దారి తప్పుతున్న దుస్థితి ఏర్పడింది.
గ్లోబల్ ఎకానమీకి చోదక శక్తిగా భావిస్తున్న భారత్లో నెలకొన్నపరిస్థితులపై అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు నివ్వెరపోతున్నాయిప్పుడు. ఇలాగే ఉంటే వ్యాపారాలు సాగవు.. పెట్టుబడులూ రావని హెచ్చరిస్తున్నాయి.
‘ఈ రకమైన సోదాలు మరిన్ని వ్యవస్థీకృత చర్యలకు దారి తీయకపోవచ్చు. కానీ ఈ దర్యాప్తులు, విచారణలు కార్పొరేట్ సంస్థల ఉనికినే ప్రశ్నార్థకం చేయగలవు. వ్యాపార సంస్థలు ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ.. దర్యాప్తు సంస్థల తనిఖీలు మార్కెట్లో ఆయా కంపెనీల విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. ఫలితంగా వాటి వ్యాపారావకాశాలు సన్నగిల్లుతాయి. రుణ పరపతి దిగజారి దేశ, విదేశాల నుంచి పెట్టుబడులూ రావు’
-ఈడీ దాడుల నేపథ్యంలో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
Fitch ratings | న్యూఢిల్లీ, మే 10: దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు చేస్తున్న దాడులు తీవ్ర ఆందోళనలకే దారితీస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు.. భారతీయ ఆర్థిక వ్యవస్థనే ఇబ్బందుల్లో పడేలా చేస్తున్నదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. ఈ క్రమంలోనే గ్లోబల్ రేటింగ్ దిగ్గజం ఫిచ్ తాజాగా చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. గత కొంతకాలంగా అటు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఇటు ఈడీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) వంటి సంస్థలు వ్యాపార, పారిశ్రామిక సంస్థలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నది చూస్తూనే ఉన్నాం. ఇటీవలే బంగారం తాకట్టుపై రుణాలిచ్చే ప్రముఖ సంస్థ మణప్పురం ఫైనాన్స్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఫిచ్ స్పందిస్తూ ఈ రకమైన తీరు భారత్లోని కార్పొరేట్ గవర్నెన్స్లో ఉన్న సంక్లిష్టతకు అద్దం పడుతున్నట్టు వ్యాఖ్యానించింది.
తప్పుడు ఎఫ్ఐఆర్తో ఈడీ సోదాలు చేపట్టిందని మణప్పురం ఫైనాన్స్ ఆరోపిస్తున్నది. కాగా, తనిఖీల్లో భాగంగా మణప్పురం ఫైనాన్స్కు చెందిన రూ.143 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్తంభింపజేసినది తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆ సంస్థ రేటింగ్ ప్రమాదంలో పడిందని ఫిచ్ పేర్కొనడం గమనార్హం. రుణ పరపతి దెబ్బతిని కంపెనీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే వీలుందనీ చెప్పింది. ‘ఈ వ్యవహారం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోని సవాళ్లకు నిదర్శనంగా నిలుస్తున్నది. పాలనాపరమైన ప్రమాణాలు ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉన్నది. బలమైన ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ ఈ తరహా సమస్యలతో కంపెనీల విస్తరణ నెమ్మదిస్తున్నది’ అని ఫిచ్ వెల్లడించింది.
కార్పొరేట్ సంస్థలపై వరుసగా దర్యాప్తు ఏజెన్సీలు చేస్తున్న దాడులతో వాటికి రుణాలిచ్చిన బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ కంపెనీలూ ఇబ్బందుల్లో పడుతున్నాయని ఫిచ్ గుర్తుచేసింది. క్రెడిట్ ప్రొఫైల్ దెబ్బతిని కొత్త అప్పులు పుట్టక, తీసుకున్న రుణాల్ని తీర్చలేక, మార్కెట్లో విశ్వసనీయత కోల్పోయి వ్యాపారావకాశాలు సన్నగిల్లుతున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో రుణాల వసూలు కష్టమేనన్నది. ఇదే కొనసాగితే అప్పులు తీసుకున్న కంపెనీలు.. వాటికి ఆ అప్పులిచ్చిన కంపెనీలు రిస్కుల పడటం ఖాయమని ఫిచ్ చెప్తున్నది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నది. అలాగే ‘స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థలకు సంబంధించి కూడా భారత్లో సాధారణ పాలనా ప్రమాణాలే ఉన్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల విషయంలోనూ లోపాలు కనిపిస్తున్నాయి’ అని స్పష్టం చేసింది.
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఇక రాజకీయ లబ్ధి కోసం రాజ్యంగ సంస్థలను పావులుగా ఆడిస్తున్నదన్న విమర్శలూ అంతటా వింటూనే ఉన్నాం. కుదిరితే సీబీఐ.. కుదరకపోతే ఈడీ.. లేదంటే మరోదాన్ని వాడుకుని ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నది చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఫిచ్ హెచ్చరికలు అంత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఐఎల్అండ్ఎఫ్ఎస్-బీఎస్ఆర్ అండ్ అసోసియేట్స్, డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ సంస్థల మాజీ ఆడిటర్లకు చెందిన చోట్లలో బుధవారం ఈడీ సోదాలు చేపట్టింది. తమ మనీ లాండరింగ్ దర్యాప్తుతో సంబంధం ఉందన్న అనుమానాలతో ఈ తనిఖీలు చేసింది. ఈడీ అధికారులు ఈ కేసులో ఆయా కంపెనీల ఉద్యోగులనూ ప్రశ్నించారు.
ఈడీ దాడులతో మార్కెట్లోని అన్ని రంగాల్లోనూ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. హైదరాబాదీ ఫార్మా సంస్థల్లోనూ ఈడీ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. నగర వ్యాప్తంగా, సమీప ప్రాంతాల్లో ఉన్నట్టువంటి ప్రముఖ ఔషధ రంగ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇక ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో రోజూ ఎక్కడో ఓ చోట వ్యాపారినో.. సంస్థలోనూ ఈడీ తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పరిధి దాటి ఈడీ వ్యవహరిస్తున్నదన్న విమర్శలూ పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి.