Inflation | న్యూఢిల్లీ, జూలై 12: ఆహారోత్పత్తులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడంతో జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠం 4.81 శాతానికి చేరింది. వినిమయ ధరల సూచి ఆధారంగా లెక్కించే ద్రవ్యోల్బణం మే నెలలో 4.31 శాతంగా ఉంది. అయితే 2022 జూన్లో ఇది 7 శాతం. ఈ ఏడాది మార్చిలో నమోదైన 5.66 శాతం తర్వాత గరిష్ఠస్థాయి ఈ జూన్ నెలలోనే. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలు సీపీఐ ద్రవ్యోల్బణం ఆధారంగా ఉంటుంది. 4 శాతానికి 2 శాతం అటూఇటూగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటూ ఆర్బీఐకి కేంద్రం నిర్దేశించగా, జూన్లో ఇది పెరిగినప్పటికీ గరిష్ఠ పరిమితి 6 శాతం దిగువనే ఉండటం సానుకూలాంశమని విశ్లేషకులు అంటున్నారు. ఆర్బీఐ తదుపరి సమీక్ష ఆగస్టులో జరగనుంది.
సీపీఐలో దాదాపు సగభాగం ఉన్న ఆహారోత్పత్తుల ధరలు నెలరోజుల్లోనే భారీగా పెరిగాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం మే నెలలో 2.96 శాతంకాగా, జూన్లో 4.49 శాతానికి ఎగిసింది. గ్రామీణ ద్రవ్యోల్బణం 4.72 శాతానికి, పట్టణ ద్రవ్యోల్బణం 4.96 శాతానికి చేరింది. 2023 మే నెలలో నిరుడు ఇదే నెలతో పోలిస్తే కూరగాయల ద్రవ్యోల్బణం రేటు 8.1 శాతం క్షీణించగా, జూన్లో ఈ క్షీణత 0.93 శాతమే. దీంతో నెలవారిగా కూరగాయల ధరలు భారీగా పెరిగినట్లయ్యింది. కొద్ది వారాలుగా కూరగాయలు.. ప్రధానంగా టమాటా ధర ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. తృణధాన్యాల ద్రవ్యోల్బణం రేటు మే నెలతో పోలిస్తే జూన్లో 12.65 శాతం నుంచి 12.71 శాతానికి చేరింది. ప్రస్తుతం ఉత్తరాదిన అధిక వర్షపాతం కారణంగా ఆహారోత్పత్తులు, ముఖ్యంగా కూరగాయల ధరలు గరిష్ఠస్థాయిలోనే కొనసాగవచ్చని, దీంతో సమీప భవిష్యత్తులో ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ చెప్పారు.
పారిశ్రామికం మళ్లీ పరుగులు పెడుతున్నది. మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ 5.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ఏప్రిల్ నెలలో నమోదైన 4.5%తో పోలిస్తే పెరగగా..అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 19.7%తో పోలిస్తే మాత్రం భారీ గా పడిపోయింది. తయారీ, గనుల రంగాలు రాణించడం వల్లనే పారిశ్రామిక సూచీ పెరిగిందని జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.